పేదల సంక్షేమమే కాంగ్రెస్​ లక్ష్యం .. గ్రామాల్లో ఆరు గ్యారంటీలపై ప్రచారం

పేదల సంక్షేమమే కాంగ్రెస్​ లక్ష్యం .. గ్రామాల్లో ఆరు గ్యారంటీలపై ప్రచారం

కామారెడ్డి, వెలుగు: పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్​లక్ష్యమని ఆ పార్టీ నాయకుడు కొండల్​రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీ స్కీమ్​లను అమలు చేస్తామన్నారు. సోమవారం కామారెడ్డి నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. రామారెడ్డి మండలం మద్దికుట బుగ్గరామలింగేశ్వర ఆలయంలో కొండల్​రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం మాచారెడ్డి మండలం చుక్కాపూర్, లక్ష్మీరావులపల్లిల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కొండల్​రెడ్డి మాట్లాడుతూ మహిళలు, రైతులు, యువత అభ్యున్నతికి కృషి చేస్తామన్నారు. కాంగ్రెస్​అధికారంలోకి రాగానే రూ.500 సిలిండర్ ఇస్తామన్నారు. మహిళలకు ప్రతినెల రూ.2,500 ఇస్తామన్నారు. ఇంటి నిర్మాణానికి రూ. 5లక్షలు ఇస్తామని పేర్కొన్నారు. ఉద్యోగాల భర్తీకి సంబంధించి మేనిఫెస్టో ప్రకటించినట్లు గుర్తుచేశారు. కామారెడ్డిలో కాంగ్రెస్​ అభ్యర్థి రేవంత్​రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు చెందిన పలువురు లీడర్లు, కార్యకర్తలు కాంగ్రెస్​లో చేరారు. బీబీపేట ఉప సర్పంచ్ సాయినాథ్, బీజేపీ మాజీ మండలాధ్యక్షుడు నరేందర్​ తదితరులు మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్, ఎన్ఎస్ యూఐ ఇన్​చార్జి రిజ్వాన్, కొండల్​రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో  చేరారు.   

బస్వాపూర్​ నుంచి జనగామ వరకు ర్యాలీ

బీబీపేట మండలం జనగామకు చెందిన వ్యాపారవేత్త వేణుగోపాల్​రెడ్డి కాంగ్రెస్​పార్టీలో చేరిన సందర్భంగా భిక్కనూరు మండలం బస్వాపూర్​నుంచి జనగామ వరకు ర్యాలీ నిర్వహించారు. వీరికి భిక్కనూరులో కాంగ్రెస్​మహిళా విభాగం స్టేట్​ మాజీ ప్రెసిడెంట్ నేరేళ్ల శారద, పీసీసీ స్టేట్​సెక్రెటరీ ఇంద్రకరణ్​రెడ్డి, డీసీసీ వైస్​ప్రెసిడెంట్ ​మద్ది చంద్రకాంత్​రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం జనగామలో నిర్వహించిన మీటింగ్​లో మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్​ మాట్లాడుతూ.. కాంగ్రెస్​ పార్టీతోనే అన్నివర్గాల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. కామారెడ్డిలో రేవంత్ రెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధిస్తారన్నారు.