
- మెదక్లో జోరుగా ఆశావహుల పైరవీలు
- బీఆర్ఎస్లోని అసమ్మతి తమను గెలిపిస్తుందని ధీమా
మెదక్, వెలుగు : రానున్న ఎన్నికల్లో మెదక్ నుంచి కాంగ్రెస్, బీజేపీ టికెట్ల కోసం పలువురు లీడర్లు తీవ్రంగా పోటీ పడుతున్నారు. అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికే మళ్లీ టికెట్ కేటాయించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం మీద ప్రజల్లో ఉండే వ్యతిరేకత, పద్మా దేవేందర్ రెడ్డిగత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం, ప్రధానమైన అభివృద్ధి పనులు అసంపూర్తిగా ఉండడం, బీఆర్ఎస్ పార్టీలో నెలకొన్న అసమ్మతియే తమను ఈ ఎన్నికల్లో గెలుపునకు బాటలు వేస్తాయని కాంగ్రెస్, బీజేపీ లీడర్లు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయా పార్టీ టికెట్ల కోసం ఆశావహులు ఎవరికివారు జోరుగా పైరవీలు చేసుకుంటున్నారు.
కాంగ్రెస్లో..
కాంగ్రెస్ పార్టీలో డీసీసీ ప్రెసిడెంట్ కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్రెడ్డి, టీపీసీసీ కార్యదర్శి చౌదరి సుప్రభాత్రావు, టీపీసీసీ అధికార ప్రతినిధి మ్యాడం బాలకృష్ణ టికెట్ రేసులో ఉన్నారు. వారు ఇటు ప్రజల, అటు పార్టీ హైకమాండ్ దృష్టిలో పడేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆశీస్సులు తనకే ఉన్నాయని, కాంగ్రెస్ టికెట్ తనకే వస్తుందన్న ధీమాలో తిరుపతిరెడ్డి ఉన్నారు. కాగా బీఆర్ఎస్ టికెట్ఆశించి భంగపడ్డ మైనంపల్లి సోషల్సర్వీస్ ఆర్గనైజేషన్ చైర్మన్ డాక్టర్ మైనంపల్లి రోహిత్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నుంచి టికెట్ఇస్తామని స్పష్టమైన హామీ లభిస్తే ఆ పార్టీలో చేరే అవకాశాలున్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
బీజేపీలో..
బీజేపీలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, హైకోర్టు అడ్వకేట్తాళ్లపల్లి రాజశేఖర్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ, సేవా కార్యక్రమాలు చేపడుతున్న టికెట్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు నియోజకవర్గంలో ముదిరాజ్ సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉండటాన్ని దృష్టిలో ఉంచుకుని, నిజాంపేట జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అలాగే నాయకుడు నందు జనార్ధన్రెడ్డి, మాజీ మంత్రి కరణం రాంచందర్ రావు కోడలు కరణం పరిణిత, పార్టీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ కూడా టికెట్ఆశిస్తున్నట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.