రాజ్యసభకు చిదంబరం.. ఆజాద్‌‌కు నో ఛాన్స్!

రాజ్యసభకు చిదంబరం.. ఆజాద్‌‌కు నో ఛాన్స్!

రాజ్యసభకు ఎన్నికల కోసం పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. బీజేపీ ఇప్పటికే ప్రకటించగా తాజాగా కాంగ్రెస్ పార్టీ జాబితాను విడుదల చేసింది. మొత్తం పది మంది పేర్లతో జాబితాను ప్రకటించింది. కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరానికి అవకాశం కల్పించారు. ఈయన్ను తమిళనాడు నుంచి రంగంలోకి దించింది. కర్నాటక రాష్ట్రం నుంచి జైరామ్ రమేశ్ ను బరిలోకి దింపింది. వీరిద్దరూ సొంత రాష్ట్రాల నుంచి పోటీ చేస్తున్నారు. పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సూర్జేవాలా, ప్రధాన కార్యదర్శి ముకుల్​ వాస్నిక్, హర్యాణా నుంచి అజయ్ మకెన్, మహారాష్ట్ర నుంచి ఇమ్రాన్ ప్రతాప్​ గర్హి, రాజస్థాన్ నుంచి ఉత్తరప్రదేశ్ నేత ప్రమోద్ తివారీ, బీహార్ రాష్ట్రం నుంచి మాజీ ఎంపీ పప్పూ యాదవ్ సతీమణి రంజీత్ రంజన్, మధ్యప్రదేశ్ నుంచి వివేక్ బంకా, ఛత్తీస్ గఢ్ నుంచి రాజీవ్ శుక్లాలను బరిలోకి దింపింది.
మరో సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ కు ఇందులో చోటు కల్పించకపోవడం గమనార్హం. అయితే.. పార్టీలో సంస్థాగతంగా సమూల మార్పులు చేయాలంటూ.. 2020లో అధ్యక్షురాలు సోనియా గాంధీకి 23 మంది నేతలు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఇందులో ముకుల్ వాస్నిక్, వివేక్ టంకాలకు రాజ్యసభ అవకాశం కల్పించడం గమనార్హం. 

అంతకుముందు బీజేపీ తన అభ్యర్థులను ప్రకటించింది. 8 రాష్ట్రాల నుంచి 16 మందికి సీట్లు ఖరారు చేసింది. రాజ్యసభ ఎన్నికలు జూన్ 10వ తేదీన జరుగనున్న సంగతి తెలిసిందే. ఎన్నికల్లో గెలవడం ద్వారా.. కాంగ్రెస్ పార్టీకి 10 మంది నేతలు సభలో అడుగుపెట్టే అవకాశాలున్నట్లు అంచనా. దీంతో ఆ పార్టీ బలం కాస్త పెరగనుంది. ప్రస్తుతం కాంగ్రెస్ బలం 29గా ఉంది. రాబోయే రెండు నెలల్లో 55 స్థానాలు ఖాళీ కానున్నాయి. మొత్తం ఏడుగురు ఎంపీల పదవీ కాలం ముగియనుంది. కపిల్‌ సిబల్‌, ఛాయా వర్మ, చిదంబరం, వివేక్‌ టంకా, జైరాం రమేశ్‌, అంబికా సోని ప్రదీప్‌ టంటాలు పదవీ కాలాన్ని పూర్తి చేసుకోనున్నారు. మొత్తంగా రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ బలం 33కు పెరిగే అవకాశాలున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

మరిన్ని వార్తల కోసం : - 

సుప్రియాకు క్షమాపణలు చెప్పిన చంద్రకాంత్


నవ భారత నిర్మాణం దిశగా మోడీ అడుగులు