ఆయన ఫొటో పెట్టుకొని ఓట్లు ఎట్ల అడుగుతరు: షర్మిల
నర్సాపూర్ (హత్నూర), వెలుగు: ఉమ్మడి ఏపీలో రెండు సార్లు అధికారంలోకి తెచ్చిన మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి కాంగ్రెస్ తీరని ద్రోహం చేసిందని వైఎస్ఆర్ టీపీ చీఫ్ షర్మిల ఆరోపించారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా గురువారం సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం కొన్యాలలో నిర్వహించిన సభలో ఆమె మాట్లాడారు. ‘వైఎస్సార్ 30 ఏండ్లు కాంగ్రెస్ కు సేవ చేశారు. 2004, 2009లో రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తెచ్చారు. కేంద్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించారు’ అని అన్నారు. వైఎస్సార్ బతికున్నప్పుడు పొగిడిన కాంగ్రెస్ పార్టీ.. చనిపోయాక ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది వైఎస్సార్ కి వెన్నుపోటు పొడిచినట్లు కాదా.. మోసం చేసినట్లు కాదా అని ప్రశ్నించారు. ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోతే ఎలా మరణించాడని దర్యాప్తు కూడా చేయించలేదన్నారు. అలాంటి కాంగ్రెస్ పార్టీ సిగ్గు లేకుండా వైఎస్సార్ ఫొటో పెట్టుకొని ఓట్లు ఎలా అడుగుతుందని నిలదీశారు.
దేవుడిపై భారం వేసి సర్కార్ దవాఖాన్లకు ఇబ్రహీంపట్నంలో కు.ని. ఆపరేషన్లు ఫెయిల్అయి నలుగురు మహిళలు చనిపోయిన ఘటనతో రాష్ట్రంలో సర్కార్దవాఖాన్లలో ట్రీట్మెంట్ఎట్లుందో అందరికీ అర్థమైందని షర్మిల అన్నారు. ‘‘కార్పొరేట్ హాస్పిటళ్లకు ప్రభుత్వం డబ్బులు ఎగ్గొడుతున్నందు వల్ల అక్కడ ఆరోగ్యశ్రీ కింద ట్రీట్మెంట్ ఇవ్వడం లేదు. దీంతో అప్పుల భారం భరించలేక దేవుడి మీద భారం వేసి ప్రజలు సర్కార్ దవాఖాన్లకు వస్తున్నరు. దీంతో సర్కార్ దవాఖాన్లలో సర్జరీలు పెరిగాయి తప్ప మీరు సౌకర్యాలు కల్పిస్తే కాదు” అని ఆమె ట్విట్టర్లో మంత్రి హరీశ్పై మండిపడ్డారు. 2018 ఎన్నికల ముందు హడావుడి చేసిన ‘కంటి వెలుగు’ ఆ ఏడాదే కనపడకుండా పోయిందన్నారు. హెల్త్ టెస్ట్లు అటకెక్కాయని, పైలెట్ ప్రాజెక్టు కింద రెండు జిల్లాల్లో పరీక్షలు చేస్తే 47 శాతం మందికి అనారోగ్యమే అని తేలడంతో ప్రభుత్వం కండ్లు బైర్లు కమ్మాయని అన్నారు. ఆఖరికి జబ్బులకు మందులు ఇవ్వడానికి కూడా రాష్ట్ర ఖజనాలో డబ్బులు లేకుండా చేశారని విమర్శించారు.