- కాంగ్రెస్ టైంలో నిర్మించిన ప్రాజెక్టులు పూర్తి చేయలేదన్న భట్టి
- చర్చకు రావాలని బీఆర్ఎస్కు సవాల్
- తాను సిద్ధమేనన్న మంత్రి జగదీశ్రెడ్డి
- ఆ రెండు ప్రాంతాల్లో ఎక్కడైనా రెడీ అన్న మినిస్టర్
- నల్గొండ జిల్లాలో వేడెక్కిన రాజకీయాలు
నల్గొండ, వెలుగు : ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ప్రాజెక్టులపై కాంగ్రెస్, బీఆర్ఎస్ ముఖ్య నేతల మధ్య మాటల యుద్దం నడుస్తోంది. జిల్లాలో పాదయాత్ర సందర్భంగా ప్రాజెక్టులపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడడం, దీనికి మంత్రి జగదీశ్రెడ్డి కౌంటర్ ఇవ్వడం ఇప్పుడు కాక పుట్టిస్తోంది. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులు పూర్తి చేయలేని దద్దమ్మ ప్రభుత్వం బీఆర్ఎస్ అని మల్లు భట్టి విక్రమార్క తన పీపుల్మార్చ్ యాత్రలో కామెంట్చేశారు. ప్రాజెక్టులపైన మంత్రి జగదీశ్ రెడ్డికి సోయి లేదని, ఎంపీగా, మండలి చైర్మన్గా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి కృషి చేయాలని సలహా ఇచ్చారు.
నక్కలగండి, పెళ్లిపాకల కింద ముంపు గ్రామాల ప్రజలను ఆదుకోవడంలో జిల్లా లీడర్లు విఫలమయ్యారని ఫైర్ అయ్యారు. చర్చకు వస్తే నిరూపిస్తానని సవాల్ విసిరారు. భట్టి కామెంట్స్పై స్పందించిన మంత్రి జగదీశ్రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా ఎదురుదాడికి దిగారు. మంత్రి జగదీశ్రెడ్డి తాను చర్చకు సిద్ధమని ప్రకటించారు. తాము చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేకే విమర్శిస్తున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ లీడర్ల విమర్శలు, ప్రతివిమర్శలతో రాజకీయం మరింత వేడెక్కింది.
జిల్లా సాగునీటి ప్రాజెక్టులే టార్గెట్
జిల్లాలో నాలుగు రోజులుగా పాదయాత్ర చేస్తున్న భట్టి విక్రమార్క ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టులనే లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతున్నారు. కాంగ్రెస్హయాంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన శ్రీశైలం సొరంగ మార్గం(ఎస్ఎల్బీసీ), నక్కలగండి, పెళ్లిపాకల, బ్రహ్మణ వెల్లంల ప్రాజెక్టులు అతీగతీ లేకుండా పోయాయని ధ్వజమెత్తారు. జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డిపై విరుచుకుపడ్డారు. కనీసం నక్కలగండి రిజర్వాయర్ కింద భూములు కోల్పోయిన నిర్వాసితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. పనిలో పనిగా కల్వకుర్తి, నెట్టెంపాడు, దేవాదుల, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులు, పవర్ ప్రాజెక్టుల నిర్మాణంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు.
నల్గొండ జిల్లా ప్రాజెక్టులపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. భట్టి సవాల్విసిరిన రెండు రోజులకు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందించారు. తన కృషి వల్లే ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు ఆసియాలోని ఇరిగేషన్ ప్రాజెక్టులకు స్ఫూర్తిగా నిలిచిందన్నారు. దామచర్ల యాదాద్రి పవర్ప్లాంట్, డిండి లిఫ్ట్ఇరిగేషన్, ఎస్ఎల్బీసీ సొరంగ పనుల వెనక తాను చేసిన కృషి ఉందన్నారు. అధికారంలోకి రావాలన్న కుట్రతోనే కాంగ్రెస్ లీడర్లు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అయితే ఏకంగా తాను చర్చకు సిద్ధమేనని ప్రకటించారు. మరోవైపు ఆదివారం నల్గొండలోని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి క్యాంప్ ఆఫీసులో జిల్లా ఎమ్మెల్యేలు మాట్లాడారు. ఉత్తమ్, జానారెడ్డి నియోజకవర్గాల్లో ఎక్కడైనా చర్చకు సిద్ధమన్నారు. కాంగ్రెస్ లీడర్లు పదవుల కోసం పాకులాడటమే తప్పా జిల్లాకు చేసిందేమీ లేదన్నారు.
నల్గొండలో హీట్ పెరిగే ఛాన్స్
ఈ నెల 14వ తేదీ నుంచి భట్టి యాత్ర నల్గొండ నియోజకవర్గంలో కొనసాగనుంది. భట్టి యాత్రను భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. భారీ బహిరంగ సభపెట్టి ప్రాజెక్టులతో పాటు, ఎమ్మెల్యేల అవినీతిని ఎండగట్టాలని ప్లాన్ చేస్తున్నారు. తొలి దశలో ప్రాజెక్టులు, ముఖ్యనేతలపైన విరుచుకుపడ్డ కాంగ్రెస్ లీడర్లు, నల్గొండలో ఎమ్మెల్యేల అవినీతిని కూడా టార్గెట్ చేసేందుకు వ్యూహం రూపొందిస్తున్నట్లు తెలిసింది.
ప్రాజెక్టులపై చర్చకు వస్తావా
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంత్రులుగా ఉన్న ఉత్తమ్కుమార్ రెడ్డి, జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి టైంలోనే నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరందించడానికి ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు తెచ్చినం. టెండర్లు పిలిచి పనులు కూడా చేయించారు. చివరి దశలో మిగిలిపోయిన పనులను బీఆర్ఎస్ తొమ్మిదేండ్ల నుంచి కంప్లీట్ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. 2017లోనే ఎస్ఎల్బీసీ పూర్తి చేసి ఉంటే నక్కలగండి, పెళ్లిపాకల ప్రాజెక్టులకు నీళ్లొచ్చేవి. దామచర్ల యాదాద్రి పవర్ ప్లాంట్ ఇంకా పూర్తి కాలేదు. భద్రాద్రి పవర్ ప్రాజెక్టు అట్లనే ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన పవర్ ప్రాజెక్టుల పనులను ఇప్పుడు పూర్తి చేసి, ఆ వెలుగులు మావే అని చెప్పుకుంటున్నారు. మళ్లీ సవాల్ చేస్తున్నా..రాష్ట్రంతో పాటు నల్గొండ జిల్లాలో చేపట్టిన సాగు, తాగునీటి ప్రాజెక్టులు, పవర్ప్రాజెక్టులపై మేం చర్చకు సిద్ధం. మీరు సిద్ధమేనా?
- భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత
ఉత్తమ్, జానా నియోజకవర్గాల్లో ఎక్కడైనా రెడీ
ఉమ్మడి జిల్లాలో జరిగిన అభివృద్ధిపై ఉత్తమ్కుమార్రెడ్డి నియోజకవర్గంలోని జాన్పహాడ్లో చర్చిద్దామా... లేదంటే జానారెడ్డి నియోజకవర్గం నాగార్జునసాగర్లోని తిరుమలగిరి ప్రాంతంలో ఉన్న రాజవరంలో చర్చ పెడదామా..మీరే తేల్చుకోండి. ఆంధ్ర పాలకులైన వైఎస్సార్, చంద్రబాబు కాలంలో తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుంటే పదవుల కోసం పెదవులు మూసుకున్న నాయకులు మీరు. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గాన్ని పర్యావరణ అనుమతుల పేరుతో అప్పటి పాలకులే ఆపే విధంగా చేశారు. జిల్లా రైతులకు నీళ్లు రాకుండా దుర్మార్గంగా పాలించిన వైఎస్సార్ను నెత్తిన పెట్టుకున్న కాంగ్రెస్ లీడర్లకు సిగ్గుండాలి. కాంగ్రెస్ హయాంలో వరుసగా రెండు పంటలకు నీళ్లివ్వలేదు. తెలంగాణ వచ్చాక వరుసగా 16 పంటలకు నీళ్లిచ్చినం. 24గంటల కరెంట్గురించి ఏ సబ్ స్టేషన్లలో అయినా కూర్చుని చర్చ చేద్దాం. నేను రెడీ..
- జి.జగదీశ్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి