నిజామాబాద్ కార్పొరేషన్ పై కాంగ్రెస్ జెండా ఎగరాలి: పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్

నిజామాబాద్ కార్పొరేషన్ పై కాంగ్రెస్ జెండా ఎగరాలి: పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్
  •  జిల్లా​ నేతలకు మహేశ్ గౌడ్​, మీనాక్షి, ఉత్తమ్​ దిశానిర్దేశం
  •  భేటీకి మాజీ మంత్రి జీవన్​రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్​ గైర్హాజరు

హైదరాబాద్, వెలుగు: నిజామాబాద్​ కార్పొరేషన్​పై కాంగ్రెస్​ జెండా ఎగరాల్సిందేనని, ఇందుకోసం స్థానిక నేతలతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని ఆ జిల్లా నేతలకు  పీసీసీ చీఫ్ మహేశ్​గౌడ్​,  పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి మీనాక్షి నటరాజన్​, మంత్రి ఉత్తమ్ కుమార్​రెడ్డి​ దిశానిర్దేశంచేశారు. నిజామాబాద్​ పార్లమెంటరీ​స్థాయి ​మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని గురువారం గాంధీభవన్​లో నిర్వహించారు. 

ఈ సమావేశానికి  ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ, ఇతర నేతలు హాజరుకాగా, జగిత్యాల నుంచి మాజీ మంత్రి జీవన్​రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్​ గైర్హాజరయ్యారు. సర్వే ఆధారంగా గెలిచే అవకాశమున్నవారికే టికెట్లు ఇస్తామని, మిగిలినవారంతా సహకరించాలని నేతలు సూచించారు. రెబల్స్ బరిలో నిలవకుండా బుజ్జగించడంపై స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు లేనిచోట్ల నియోజకవర్గ ఇన్​చార్జిలు, డీసీసీ చీఫ్,  పార్టీ పట్టణ అధ్యక్షులు దృష్టిపెట్టాలన్నారు.  

మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభావం అంతగా ఉండకపోవచ్చని, బీజేపీకి కొన్నిచోట్ల అనుకూల వాతావరణం ఉన్నందున ఆ పార్టీ బలంగా ఉన్న చోట్ల వ్యూహాత్మకంగా వ్యవహరించాలని నేతలు సూచించారు.  కాగా, ఈ సమావేశంలో జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై ప్రత్యేక చర్చ జరిగింది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే సంజయ్ ఎవరికివారు తమ అనుచరులకే టికెట్లు ఇవ్వాలని పట్టుబడుతున్నందున ఎలా ముందుకు వెళ్లాలనేదానిపై సమాలోచనలు చేశారు.