హైదరాబాద్, వెలుగు: ధరణిలో జరిగిన అక్రమాల చిట్టాను బయటపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఇప్పటికే విచారణ కోసం కమిటీని నియమించిన ప్రభుత్వం.. ఆ కమిటీ నుంచి పూర్తి వివరాలను తెప్పించుకుంటున్నది. లోక్సభ ఎన్నికల తర్వాత జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ధరణి పోర్టల్, భూ అక్రమాలపై శ్వేతపత్రం రిలీజ్ చేయాలని భావిస్తున్నది.
గత బీఆర్ఎస్ సర్కార్లో మంత్రులుగా పనిచేసిన కొందరు ధరణిలో భారీగా అక్రమాలకు పాల్పడ్డట్లు ప్రస్తుత ప్రభుత్వం దృష్టికి వచ్చింది. మాజీ సీఎం కేసీఆర్ కుటుంబసభ్యుల్లోని ఆరుగురు కూడా భూములను కొల్లగొట్టినట్టు రిపోర్టులు అందాయి. ఆ వివరాలన్నింటినీ ఆధారాలతో పాటు జనం ముందు పెట్టేందుకు ప్రభుత్వం రెడీ అవుతున్నది.
కమిటీ విచారణలో అనేక అక్రమాలు బయటికి
ధరణి అక్రమాలను తేల్చేందుకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ధరణి కమిటీని నియమించింది. ఈ కమిటీ అన్ని వివరాలను తెప్పించుకొని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నది. నిషేధిత జాబితాలో ఉన్న 23 ఎకరాల భూమి బీఆర్ఎస్ ఎంపీ సంతోష్ సంబంధీకులకు పట్టాగా మారిందని ధరణి కమిటీలోని సభ్యుడు కోదండరెడ్డి ఇటీవల బయటపెట్టారు. ఆ ఒక్కటే కాదని.. అలా ముఖ్యమైన బీఆర్ఎస్ లీడర్లు, గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన కొందరు కూడా ధరణిలో అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. ఏయే భూములు ఎక్కడెక్కడ, ఎవరెవరూ, ఎలా వాళ్ల వాళ్ల పేర్ల మీదికి మార్చుకున్నారనే దానిపై పూర్తి వివరాలతో జాబితాను ప్రభుత్వం సిద్ధం చేస్తున్నది. ప్రభుత్వ, వక్ఫ్, దేవాదాయ, అసైన్డ్ భూములను బీఆర్ఎస్ లీడర్లు వాళ్ల హయాంలో తమ పేర్ల మీదికి ఎలా మార్చుకున్నారనే దానిపై ఇప్పటికే ధరణి కమిటీకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వాటిని వెరిఫై చేసుకోవడంతో పాటు అన్ని జిల్లాల్లో కలెక్టర్ల నుంచి కూడా ప్రభుత్వం సమాచారం తెప్పించుకుంటున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన నలుగురు లీడర్లు ధరణిలో భూములను కొల్లగొట్టినట్లు ప్రస్తుత సర్కార్ దృష్టికి వచ్చింది. మాజీ సీఎం కుటుంబ సభ్యుల్లో ఆరుగురు కూడా ధరణిలో అక్రమంగా భూములు కాజేశారనిప్రభుత్వం ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిసింది.
జనాలే డాక్యుమెంట్లు తీసుకొచ్చి ఇస్తున్నరు
ధరణి పోర్టల్తో భూముల గోల్మాల్ జరిగిందన్న ఆరోపణలు మొదటి నుంచి వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సీఎం రేవంత్ రెడ్డికి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి జనం నుంచి భారీగా ఫిర్యాదులు అందుతున్నాయి. రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి , సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్నగర్, కరీంనగర్, మెదక్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, జనగాం, వరంగల్, హన్మకొండ జిల్లాల్లోని అక్రమ భూ బదలాయింపులపై ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయి. ఎవరెవరు, ఎలా భూములు మార్చుకున్నారు? అంతకుముందు ఆ భూమి క్లాసిఫికేషన్ ఏమిటి ? తప్పుడు పత్రాలు ఏం సృష్టించారు ? కబ్జాలో ఎవరుంటే.. పట్టాలు ఎవరికి వచ్చాయి ? అనే వివరాలను డాక్యుమెంట్లతో సహా జనం అందజేశారు.
2014 కంటే ముందు, ఆ తర్వాత భూ వివరాలపై ఫోరెన్సిక్ ఆడిట్
ధరణిలోని అక్రమాలను మరింత సులువుగా గుర్తించేందుకు ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. 2014 కంటే ముందు ప్రభుత్వ, వక్ఫ్, దేవాదాయ, భూదాన్, అసైన్డ్ భూములు ఎన్ని ఎకరాలు ఉన్నాయి ? ఎవరెవరి పేరు మీద ఉన్నాయి?.. అనే డేటాను తీస్తున్నది. దాన్ని ఆధారంగా చేసుకుని 2014 తరువాత ఏయే భూములు ఎవరెవరికి మారాయి ? ఏ రకంగా ఇచ్చారు ? 2020లో ధరణి పోర్టల్ వచ్చాక ఎలా మారాయి? ప్రొసీడింగ్స్ ఏమైనా ఇచ్చారా ? ఇస్తే.. దేని ఆధారంగా ఇచ్చారు? అని పూర్తి స్థాయిలో ఫోరెన్సిక్ ఆడిట్ చేయనున్నారు. మండలాలు, జిల్లాల వారీగా ఈ కసరత్తును చేపట్టనున్నారు. దీంతో ఫీల్డ్ లెవెల్ నుంచే అసలు విషయం బయటపడుతుందని అధికారులు అంటున్నారు