హైదరాబాద్, వెలుగు: కేసీఆర్కు ఒక్క పీకే మాత్రమే ఉన్నాడని, కానీ కాంగ్రెస్కు లక్షల మంది ఏకే 47లున్నారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. పార్టీలోని ప్రతి కార్యకర్త ఒక ఏకే 47 అని ఆయన అన్నారు. శుక్రవారం హైదరాబాద్లోని ఇందిరాభవన్లో నిర్వహించిన డిజిటల్మెంబర్షిప్ సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 40 లక్షల మంది కాంగ్రెస్ పార్టీ డిజిటల్ మెంబర్షిప్ తీసుకున్నారని, దేశంలోనే అది రికార్డ్ అని చెప్పారు. నల్గొండలో అత్యధికంగా మెంబర్షిప్లు తీసుకున్నారన్నారు. మార్చి 31 దాకా డిజిటల్ మెంబర్షిప్కు గడువు ఉందని, మరికొన్ని లక్షల సభ్యత్వాలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పారు. టీఆర్ఎస్ 62 లక్షల సభ్యత్వాలను చేసిందని, దాన్ని క్రాస్ చేసేందుకు కృషి చేయాలని పార్టీ నేతలకు రేవంత్ సూచించారు. పార్టీ పట్ల ప్రజలు చూపిస్తున్న ఆదరణను చూస్తుంటే.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందన్న ధీమా పెరిగిందన్నారు. కాంగ్రెస్ను పునాదుల నుంచి నిర్మించాల్సిన పరిస్థితులు
వచ్చాయన్నారు.
పనిచేసినోళ్లకే పదవులు
కేసీఆర్ కొనుగోళ్ల రాజకీయాలతో ప్రజలు ఆలోచనలో పడ్డారని, వాళ్లకు కాంగ్రెస్పై నమ్మకం కలిగేలా చేయాలని కేడర్కు రేవంత్ సూచించారు. డిజిటల్ మెంబర్ షిప్తో కాంగ్రెస్ నాయకుల సత్తా ఏంటో తెలుస్తుందన్నారు. మెంబర్షిప్ డ్రైవ్లో కీలకంగా పనిచేసినోళ్లకు ఏఐసీసీ, పీసీసీల్లో పదవులిస్తామని హామీ ఇచ్చారు. పని చేయనోళ్లకు పదవులు రాకుండా తాను అడ్డుకుంటానని తేల్చి చెప్పారు. అవసరమైతే సోనియాగాంధీ, రాహుల్ గాంధీకి చెప్తానని అన్నారు. అన్ని బూత్లలో 100 సభ్యత్వాలు అయితేనే పీసీసీ బ్లాక్ మెంబర్ అవుతారని స్పష్టం చేశారు. పది రోజుల్లో టార్గెట్ను అందుకోవాలని చెప్పారు. సభ్యత్వంపై బాగా పనిచేసినోళ్లమీద సోనియాకు నివేదిక ఇస్తానన్నారు. ఏఐసీసీ అభిప్రాయ సేకరణలో ముందున్నోళ్లకే ఎమ్మెల్యే అభ్యర్థిగా చాన్స్ ఇస్తామన్నారు. టికెట్ల కేటాయింపుపై ఢిల్లీ నుంచి అభిప్రాయ సేకరణ చేస్తారని, కాబట్టి టికెట్ ఆశించేటోళ్లంతా జాగ్రత్తగా పని చేయాలని సూచించారు.