హైదరాబాద్ చేరుకున్న దిగ్విజయ్ సింగ్
వెంటనే వెళ్లి కలిసిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
ఇయ్యాల కాంగ్రెస్ నేతలతో దిగ్విజయ్ వరుస మీటింగ్లు
హైదరాబాద్, వెలుగు : కాంగ్రెస్ హైకమాండ్ దూత దిగ్విజయ్ సింగ్ బుధవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. బంజారాహిల్స్ లోని తాజ్ కృష్ణ లో బస చేశారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న దిగ్విజయ్ సింగ్ కు పీసీసీ ప్రొటోకాల్ ఇన్ చార్జ్ హర్కర వేణుగోపాల్, వర్కింగ్ ప్రెసిడెంట్లు మహేశ్కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్ స్వాగతం పలికారు. దిగ్విజయ్ హోటల్కు రాగానే ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ పరిస్థితిని వివరించినట్లు తెలుస్తోంది. గురువారం గాంధీభవన్ లో ఉదయం 10 నుంచి 4 గంటల వరకు అసంతృప్త రాగం వినిపిస్తున్న సీనియర్ నేతలతో దిగ్విజయ్ సమావేశం కానున్నారు.
అదే విధంగా పీఏసీ ( పొలిటికల్ అఫైర్స్ కమిటీ ) మీటింగ్లో కూడా పాల్గొననున్నట్లు తెలుస్తోంది. సమావేశాలు ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతారని పార్టీ నేతలు తెలిపారు. అయితే, మీటింగ్స్ షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదని నేతలు చెబుతున్నారు. పాత, కొత్త నేతల మధ్య గొడవలను పరిష్కరించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ దిగ్విజయ్ సింగ్ ను తెలంగాణకు పంపిన విషయం తెలిసిందే. ఉమ్మడి రాష్ట్రంలో దిగ్విజయ్ సింగ్ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ గా పనిచేయడంతో పాటు తెలంగాణ ఏర్పడ్డాక కూడా కొంత కాలం పనిచేశారు. కాంగ్రెస్ లోని రాష్ట్ర నేతలందిరితోనూ దిగ్విజయ్ కు పరిచయాలు ఉన్న నేపథ్యంలో నష్టనివారణ చర్యలకు అధిష్టానం దిగ్విజయ్ని పంపింది.

