కాంగ్రెస్ తోనే రేవంత్ కు ప్రమాదం : బీజేపీ స్టేట్​ చీఫ్​ కిషన్ రెడ్డి

కాంగ్రెస్ తోనే రేవంత్ కు ప్రమాదం : బీజేపీ స్టేట్​ చీఫ్​ కిషన్ రెడ్డి
  •  మేం ప్రభుత్వాన్ని ఎలాంటి డిస్ట్రబ్​చేయం
  •  దొంగలు పోయి.. గజదొంగలు వచ్చిండ్రు
  • ఐదేండ్ల తర్వాత వచ్చేది మా సర్కారే

హైదరాబాద్: తనను పదవి నుంచి తప్పించేందుకు కుట్ర జరుగుతోందంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు  బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి కౌంటర్​ఇచ్చారు. ఆయనకు బీజేపీతో ఎలాంటి అపాయం లేదని.. కాంగ్రెస్ పార్టీ నుంచే ప్రమాదం పొంచి ఉందని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తాము ఎలాంటి డిస్ట్రబ్ చేయమని స్పష్టం చేశారు. తెలంగాణలో దొంగలుపోయి.. గజదొంగలు వచ్చినట్లు ఉంది ప్రభుత్వ పాలన అని ఎద్దేవా చేశారు. 

నాంపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీల డీఎన్ఏ ఒక్కటే.  కాంగ్రెస్‌కు ఓటేసిందుకు ప్రజల నుంచి రాహుల్ ట్యాక్స్ వసూల్ చేస్తున్నరు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా హస్తం పార్టీకి 40 ఎంపీ సీట్లు కూడా రావు. అది మునిగిపోతున్న నావ. రాష్ట్రంలో బీజేపీ మెజార్టీ సీట్లు గెలవబోతుంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మరోసారి ఏర్పడుతుంది. మోదీ మూడోసారి ప్రధాని అవుతారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజలు ఆత్మగౌరవంతో బతికేలా మార్పులు జరుగుతాయి’ అని కిషన్​రెడ్డి తెలిపారు.