దేశంలో బీజేపీ నీచ రాజకీయం పరాకాష్టకు చేరిందన్నారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. భారత్లో ప్రజాస్వామ్యాన్ని నిలువునా ఖూనీ చేస్తూ, ప్రతిపక్షాల గొంతు నొక్కే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు.
గడిచిన 12 ఏళ్లుగా అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం.. విలువలను వదిలేసి, తీవ్ర దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణే దీనికి తాజా ఉదాహరణ అని అన్నారు. ఈ అప్రజాస్వామిక చర్యలను దేశ ప్రజలు గమనిస్తూనే ఉన్నారని... బీజేపీ చేస్తున్న ఈ అన్యాయపు రాజకీయాలకు కాలమే సమాధానం చెబుతుందన్నారు.
మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ను అత్యంత అన్యాయంగా, నిబంధనలకు విరుద్ధంగా తిరస్కరించారని ఆరోపించారు. మధ్యప్రదేశ్లో ఉన్న అసెంబ్లీ సంఖ్యాబలం ప్రకారం.. బీజేపీకి దక్కేది కేవలం రెండు రాజ్యసభ సీట్లు మాత్రమేనని.. కానీ.. ఎలాగైనా సరే కాంగ్రెస్కు దక్కాల్సిన రాజ్యసభ సీటును లాక్కోవాలనే కుట్రతోనే.. కావాలని మీనాక్షి నటరాజన్ నామినేషన్ను తిరస్కరించారని అన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో గెలవలేక, ఇలాంటి దొడ్డిదారి రాజకీయాలతో ప్రతిపక్షాలను అణచివేయాలని చూస్తున్నారని మండిపడ్డారు జగ్గారెడ్డి
►ALSO READ | ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్ లో.. ప్రతిభ చాటిన మాజీ మావోయిస్ట్ అగ్రనేత దేవ్ జీ
మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ ను రిటర్నింగ్ ఆఫీసర్ తిరస్కరించిన సంగతి తెలిసిందే. మీనాక్షి నామినేషన్ తిరస్కరణపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది కాంగ్రెస్. నామినేషన్ను తిరస్కరించిన రిటర్నింగ్ ఆఫీసర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అత్యవసర విచారణ జరపాలని కోరింది. మీనాక్షిపై తెలంగాణలో అసలు క్రిమినల్ కేసే లేదని, కేవలం కోర్టు నోటీసు మాత్రమే ఉందని పిటిషన్లో పేర్కొంది.
ఈ క్రమంలో కాంగ్రెస్ పిటిషన్ పై విచారణకు అంగీకరించింది సుప్రీంకోర్టు. గురువారం ( జూన్ 11 ) ఈ పిటిషన్ పై విచారణకు అంగీకారం తెలిపిన సుప్రీంకోర్టు తక్షణ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని పేర్కొంటూ విచారణను శుక్రవారానికి (జూన్ 12 ) వాయిదా వేసింది.
