టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాబందుల సమితి

టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాబందుల సమితి

ఖమ్మం కార్పొరేషన్​, వెలుగు: తెలంగాణ రాష్ట్ర సమితి ​పార్టీ తెలంగాణ రాబందుల సమితిగా మారిందని, పోలీసులను గుప్పిట్లో పెట్టుకుని ప్రజలను పట్టిపీడుస్తున్నారని కాంగ్రెస్​ పార్టీ రాష్ర్ట ప్రచార కమిటీ చైర్మెన్, మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్​ అన్నారు. మంగళవారం  ఖమ్మం వచ్చిన ముధుయాష్కీ, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్​ ఏలేటి మహేశ్వరరెడ్డి, ఆల్​ ఇండియా ఎస్టీసెల్​ ఉపాధ్యక్షుడు బెల్లయ్యనాయక్​లతో కలిసి సంజీవరెడ్డిభవన్​లో మాట్లాడారు. రైతుల సమస్యలు, వడ్ల కొనుగోళ్ల విషయంలో టీఆర్ఎస్, బీజెపీ వైఖరిని నిరసిస్తూ మే 6న వరంగల్​లో రైతు సంఘర్షణ సభ నిర్వహిస్తున్నామని​, దీనికి రాహుల్ గాంధీ వస్తున్నారన్నారు. సభకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి పెద్ద ఎత్తున జనాలు, కాంగ్రెస్ ​పార్టీ కార్యకర్తలు, లీడర్లు తరలిరావాలని పిలుపునిచ్చారు.

రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు హత్యలు, దోపిడీలు, కబ్జాలు చేస్తూ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారన్నారు. జిల్లా మంత్రి పువ్వాడ అజయ్​ భూకబ్జాలకు పాల్పడుతూ ప్రశ్నించే వారిపై పోలీసులను అడ్డం పెట్టుకుని దాడులు చేయిస్తూ గుండాలా వ్యవహరిస్తున్నారన్నారు. ఒక యువకుడు ఆత్మహత్య చేసుకుని, చివరి నిమిషంలో మీడియాకు వాంగ్మూలం ఇచ్చినా ఎటువంటి చర్యలు లేవని, అదే కర్ణాటకలో ఓ మంత్రిపై ఆరోపణలు వస్తే అతను మినిస్టర్​ పదవికి రాజీనామా చేశారన్నారు. సీఎం కేసీఆర్​ఈ రౌడీ మంత్రిని బర్తరఫ్​ చేయాలని డిమాండ్​ చేశారు. ఏలేటి మహేశ్వర్​రెడ్డి మాట్లాడుతూ మంత్రి అజయ్​ మమత మెడికల్​ కాలేజీ పేరుతో అసైన్డ్​ భూములను కబ్జా చేశారన్నారు. ఆల్​ ఇండియా ఎస్టీ సెల్​ ఉపాధ్యక్షుడు బెల్లయ్యనాయక్​ మాట్లాడుతూ మంత్రి అజయ్​ ప్రతి కాంట్రాక్ట్​లో వాటాలు తీసుకుంటూ ఇసుకదోపిడీకి పాల్పడుతున్నాడన్నారు. పేదల భూములు సాగు చేసుకుంటే ట్రెంచింగ్ ​కొట్టే అధికారులు..దమ్ముంటే మంత్రి ​అక్రమించుకున్న మమత కళాశాల ఆసైన్డ్​భూమిలో ట్రెంచ్​కొట్టాలన్నారు. డీసీసీ అధ్యక్షుడు పువ్వాల్ల దుర్గాప్రసాద్​, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, రాయల నాగేశ్వరరావు, నగర కాంగ్రెస్​ అధ్యక్షుడు మహ్మద్​ జావీద్​, మిక్కిలినేని నరేందర్​, వడ్డెబోయిన నర్సింహారావు, బొందయ్య  పాల్గొన్నారు.