ఎల్​అండ్​ టీ లేఖ కుట్రపూరితం.. విచారణ జరిపి నిజాన్ని నిగ్గు తేల్చాలి: నిరంజన్​

ఎల్​అండ్​ టీ లేఖ కుట్రపూరితం.. విచారణ జరిపి నిజాన్ని నిగ్గు తేల్చాలి: నిరంజన్​
  • ఎల్​అండ్​ టీ లేఖ కుట్రపూరితం
  • విచారణ జరిపి నిజాన్ని నిగ్గు తేల్చాలి: నిరంజన్​

హైదరాబాద్, వెలుగు :  మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ తమ బాధ్యత కాదని ఎల్​ అండ్​ టీ సంస్థ ప్రభుత్వానికి లేఖ రాయడం కుట్రపూరితమని పీసీసీ సీనియర్​ వైస్​ ప్రెసిడెంట్​జి.నిరంజన్​ మండిపడ్డారు. శనివారం ఆయన గాంధీభవన్​లో మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో విచారణ జరిపి నిజాన్ని నిగ్గు తేల్చాలన్నారు. ఘటన జరిగిన సమయంలో బ్యారేజీ నిర్వహణ.. నిర్మాణ సంస్థ ఎల్​ అండ్​ టీ ఆధ్వర్యంలోనే ఉందని ఈఎన్​సీ వెంకటేశ్వర్లు ప్రకటించారని, అదే రోజూ తామే పునరుద్ధరిస్తామని ఎల్​ అండ్​ టీ కూడా ప్రకటించిందని గుర్తుచేశారు. 

ఇప్పుడు మాటమార్చడంలో కారణమేంటని నిలదీశారు. ప్రభుత్వం మారినందునే ఎల్​ అండ్​ టీ తన విధానాన్ని మార్చుకున్నదా? అని ప్రశ్నించారు. అనుబంధ ఒప్పందం చేసుకుంటేనే బాగుచేస్తామని అనడంలో అంతర్యం ఏంటని మండిపడ్డారు. ఈ ఘటన పై కేంద్ర ప్రభుత్వం, నాటి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతోనే.. ఆ సంస్థ తమ బాధ్యత కాదని చెప్పిందన్నారు. ఈ ఘటన వెనుక గత ప్రభుత్వ కుట్ర ఉందా? అని నిరంజన్​ ప్రశ్నించారు.