- గవర్నర్కు వినతిపత్రం ఇచ్చేందుకు ర్యాలీగా వెళ్లిన లీడర్లు
- అనుమతి ఇవ్వని రాజ్భవన్.. దిల్కుషాలో బైఠాయింపు
- అరెస్ట్ చేసిన పోలీసులు.. 2 గంటల తర్వాత విడుదల
హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రాజ్భవన్కు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో దిల్కుషా గెస్ట్హౌజ్లో లీడర్లు భైఠాయించారు. పోలీసులు వారిని అరెస్టు చేసి గోషామహల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. రెండు గంటల తర్వాత విడుదల చేశారు. అరెస్టయిన వారిలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్కం ఠాగూర్, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్లు రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ సెక్రటరీలు బోసు రాజు, శ్రీనివాస్ కృష్ణన్, నేతలు దామోదర రాజనర్సింహ, దాసోజు శ్రావణ్కుమార్, అంజన్కుమార్ యాదవ్, సంపత్కుమార్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరెళ్ల శారద, ఎమ్మెల్యే సీతక్క, ఇందిరాశోభన్ తదితరులున్నారు.
పర్మిషన్ లేకున్నా..
కొత్త అగ్రి చట్టాలు రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయని, వ్యవసాయ రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేస్తాయని పేర్కొంటూ కాంగ్రెస్ నేతలు గవర్నర్కు వినతిపత్రం ఇవ్వాలని భావించారు. ఇందుకోసం సోమవారం రాజ్భవన్కు బయలుదేరి వెళ్లారు. అయితే గవర్నర్ ఆఫీసు నుంచి వారికి పర్మిషన్ రాలేదు. కరోనా కారణంగా ఎవర్నీ కలిసేందుకు గవర్నర్ తమిళి సై సుముఖంగా లేరని కాంగ్రెస్ నేతలకు సమాచారం వచ్చింది. కనీసం ఎవరైనా అధికారికి వినతిపత్రం ఇచ్చే అవకాశం కల్పించాలని నేతలు కోరారు. అయితే ఈ–మెయిల్ ద్వారా పంపాలంటూ అటు నుంచి సమాధానం వచ్చింది. దాంతో అప్పటికే రాజ్భవన్ పక్కనే ఉన్న దిల్కుషా గెస్ట్హౌస్కు చేరుకున్న కాంగ్రెస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. దిల్కుషా నుంచి వెంటనే వెళ్లిపోవాలని నేతలకు పోలీసులు సూచించారు. కానీ వాళ్లు అక్కడే బైఠాయించడంతో అరెస్టు చేశారు.
కార్పొరేట్ సంస్థలకే లాభం: ఉత్తమ్
ఉత్తమ్ మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో ఏకపక్షంగా మూడు అగ్రి బిల్లులను అప్రజాస్వామికంగా పాస్ చేయించిందని ఆరోపించారు. బీజేపీ అనుబంధ పార్టీలు వ్యతిరేకించినా బిల్లులు పాస్ చేయించడం విచారకరమన్నారు. కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చేలా ఈ కొత్త చట్టాలు ఉన్నాయని మండిపడ్డారు. కార్పొరేట్ సంస్థలు కావాల్సినంత ఆహార ఉత్పత్తులు తయారుచేసుకోవడానికి, ఇష్టం వచ్చిన రీతిలో ధరలు పెంచుకోవడానికి ఈ చట్టాలు ఉపయోగపడతాయన్నారు. మోడీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా, ప్రజావ్యతిరేకంగా పాలన సాగిస్తోందని విమర్శించారు. ఈ చట్టాల వెనక అనేక కుట్రలు దాగి ఉన్నాయని, వాటిని రద్దు చేయించే వరకు కాంగ్రెస్ పోరాడుతుందని స్పష్టం చేశారు. రైతుల సమస్యలపై అక్టోబర్ 2న రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసన ప్రదర్శనలు చేస్తుందన్నారు.