స్టేట్ పాలిటిక్స్ లో గత కొన్నిరోజులుగా హై టెన్షన్ క్రియేట్ చేసిన హుజురాబాద్ బైపోల్ లో బీజేపీ ఘన విజయం సాధించింది. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ప్రత్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ పై 23,855 వేల మెజారిటీతో విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థికి 1,07,022ఓట్లు వచ్చాయి. హుజురాబాద్ లో మొత్తం 2,37,036 ఓట్లు కాగా..ఇందులో 2,05,236 పోలయ్యాయి. ఇందులో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కు 1,07,022 పోలయ్యాయి. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ కు 83,167 ఓట్లు పోలయ్యాయి. ఇక కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ 3,014 ఓట్లు మాత్రమే రావడంతో డిపాజిట్ కోల్పోయారు.
డిపాజిట్ కోల్పోయిన కాంగ్రెస్
హుజురాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ కు డిపాజిట్ రావాలంటే పోలైన ఓట్లలో 1/6వ వంతు రావాలి. అంటే పోలైన 2,05,236 ఓట్లలో 34,206 ఓట్లు వస్తే బల్మూరికి డిపాజిట్ దక్కేది. కానీ ఎవరూ ఊహించని విధంగా బల్మూరికి 3014 ఓట్లు మాత్రమే వచ్చాయి.హుజురాబాద్ ఉపఎన్నికలో ప్రత్యర్థి పార్టీలకు కాంగ్రెస్ పోటినివ్వకపోగా.. ఘోరంగా డిపాజిట్ కోల్పోయింది.
బల్మూరి వెంకట్ రాజకీయ ప్రస్థానం
బల్మూరి వెంకట్ నర్సింగరావు ది పెద్దపల్లి జిల్లా కల్వ శ్రీరాం పూర్ మండలం తర్లపల్లి స్వగ్రామం. వెలమ సామాజిక వర్గానికి చెందిన వెంకట్ ఎంబీబీఎస్ చదివాడు. గత ఆరేళ్లుగా ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. 2015,2018లో జరిగిన ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా గెలిచారు. 2017లో ఎన్ఎస్యూఐ జాతీయ కార్యదర్శిగా పనిచేశారు. 2018 ముందస్తు ఎన్నికల్లో టికెట్ ఆశించినప్పటికీ దక్కలేదు. లేటెస్ట్ గా హుజురాబాద్ బైపోల్ లో కాంగ్రెస్ తరపున పోటీచేసి ఓటమి పాలయ్యాడు.