ధరణి స్థానంలో భూమాత

ధరణి స్థానంలో భూమాత
  • ధరణి స్థానంలో భూమాత
  •  భూకమతాలు సర్వే చేసి రైతులకు భూమి హక్కులు, 
  • భూధార్​ కార్డులుల్యాండ్​ కమిషన్​ పెట్టి ప్రభుత్వ భూములకు రక్షణ
  • మేనిఫెస్టోలో కాంగ్రెస్​ హామీ

హైదరాబాద్​, వెలుగు: బీఆర్​ఎస్​ సర్కార్​ తీసుకువచ్చిన ధరణి పోర్టల్​ను రద్దు చేసి  మరింత మెరుగైన రెవెన్యూ సేవల కోసం ‘భూమాత’ పేరిట పోర్టల్​ను తీసుకొస్తామని కాంగ్రెస్​ తన మేనిఫెస్టోలో ప్రకటించింది. భూమి హక్కులు కోల్పోయిన రైతులందరికీ న్యాయం చేసేలా.. సమగ్ర భూ కమతాల సర్వే చేపట్టి, తిరిగి హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చింది. 

ఆ సర్వే ద్వారా ప్రతి రైతులకూ ‘భూధార్​ కార్డ్​’ను అందజేస్తామని తెలిపింది. కోనేరు రంగారావు ల్యాండ్​ కమిటీ సిఫార్సులను అమలు చేస్తామని కాంగ్రెస్​ తెలిపింది. ల్యాండ్​ కమిషన్​ను ఏర్పాటు చేసి.. ప్రభుత్వ భూములకు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చింది. ప్రజల భూములను, భూమి హక్కులను కాపాడేందుకు సమగ్రమైన రెవెన్యూ ట్రిబ్యునల్​ను ఏర్పాటు చేస్తామని పేర్కొంది. 

భూసంస్కరణల ద్వారా గత కాంగ్రెస్​ ప్రభుత్వం పేదలకు పంచిన 25 లక్షల ఎకరాల భూములపై ఆ పేదలకే  పూర్తి స్థాయి భూ హక్కులను కల్పిస్తామని స్పష్టం చేసింది. భవిష్యత్​లో ఎవరి మధ్యనా భూమి కొట్లాటలు, వివాదాలు లేకుండా ఉండేలా పారదర్శకమైన ఆన్​లైన్​ వ్యవస్థను ఏర్పాటు చేసి.. భూయజమానికి పూర్తి హక్కులను కల్పించడమే ధ్యేయమని మేనిఫెస్టోలో కాంగ్రెస్​ పేర్కొంది. నిషేధిత జాబితాలో చేర్చిన భూములను.. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే తొలగిస్తామని స్పష్టం చేసింది.