
- స్టూడెంట్ల నుంచి రైతుల దాకా రిప్రెజెంటేషన్లు
- మేనిఫెస్టోలో తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తులు
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీకి వివిధ వర్గాల నుంచి వినతులు వెల్లువెత్తుతున్నాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. ఇప్పటి వరకు 50కిపైగా రిప్రెజెంటేషన్లు వచ్చాయి. స్టూడెంట్లు, నిరుద్యోగులు, రైతులు మొదలు వివిధ కుల సంఘాల నేతలు.. కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీని కలిసి తమ గోడు చెప్పుకుంటున్నారు. తమకు కావాల్సిన డిమాండ్లను మేనిఫెస్టోలో చేర్చాలంటూ వినతి పత్రాలను ఇస్తున్నారు. మేనిఫెస్టోకి సంబంధించి ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలన్న పార్టీ పెద్దల నిర్ణయంతో.. వివిధ వర్గాల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వస్తున్నాయి. మరోవైపు మేనిఫెస్టో కమిటీ సభ్యులు ఇప్పటికే రోజుకు రెండు జిల్లాల చొప్పున పర్యటిస్తున్నారు. అక్కడి ప్రజలకు ఏమేం కావాలో అడిగి తెలుసుకుంటున్నారు.
సర్కారు పట్టించుకోకపోవడంతో..
రాష్ట్ర సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలపై ఇప్పటికే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వస్తున్నది. ప్రత్యేకించి ఉద్యోగులు, నిరుద్యోగుల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఈ క్రమంలోనే నిరుద్యోగులు టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకు సంబంధించి చేపట్టాల్సిన చర్యలపై మేనిఫెస్టో కమిటీకి విజ్ఞప్తులు చేశారు. అంతేగాకుండా జాబ్ క్యాలెండర్ను మేనిఫెస్టోలో చేర్చాలని కోరుతున్నారు. ఇటు పలువురు కాంట్రాక్ట్ ఉద్యోగులు, డిగ్రీ లెక్చరర్లు, పార్ట్టైం లెక్చరర్లు.. తమ జాబ్లను రెగ్యులరైజ్ చేయాలంటూ కోరుతున్నారు. డీఎస్సీ కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న అభ్యర్థులు.. మెగా డీఎస్సీ కోసం పట్టుబడుతున్నారు. తిప్పలు పడుతున్నామంటూ ఓయూ విద్యార్థులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారికి కనీసం ఫెలోషిప్స్ కూడా రావడం లేదన్న ఆందోళన ఉన్నది. దీంతో రీసెర్చ్ స్కాలర్స్కు ఫెలోషిప్ ఇచ్చేలా మేనిఫెస్టోలో పొందుపరచాలంటూ విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పెషల్గా ఓయూ విద్యార్థులతో సమావేశం కావాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. గురువారం ఓయూకు వెళ్లాల్సి ఉన్నా.. వివిధ కారణాలతో ఆ ప్రోగ్రామ్ వాయిదా పడింది. 317 జీవో రద్దు కోరుతూ నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల టూర్లలో టీచర్ దంపతులు కోరారు.
కుల సంఘాలదీ అదే దారి
అన్ని వర్గాలతో పాటు కులసంఘాలూ తమకూ చేయాల్సినంత చేయాలంటున్నాయి. ఇప్పటికే మంద కృష్ణ మాదిగ నేతృత్వంలోని ఎమ్మార్పీఎస్.. ఎస్సీ వర్గీకరణ డిమాండ్ను తెరపైకి తీసుకొచ్చింది. కాంగ్రెస్ పార్టీ కూడా వర్గీకరణకు కట్టుబడి ఉన్నామంటున్నది. ఎస్టీ రిజర్వేషన్లలో తమకు ప్రాతినిధ్యం దక్కడం లేదంటూ ఎరుకల సంఘం నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాతినిధ్యాన్ని పెంచేలా మేనిఫెస్టోలో పెట్టాలంటున్నారు. బీసీ డీ నుంచి బీసీఏలోకి తమను మార్చాలని తెనుగ సంఘం డిమాండ్ చేస్తున్నది. వారితో పాటు ముదిరాజ్లు, గంగపుత్ర సహా బీసీల్లోని మరిన్ని కుల సంఘాలు తమ డిమాండ్లను వినిపిస్తున్నాయి. రాజకీయాల్లో బీసీలకు ఎక్కువ ప్రాతినిధ్యం కల్పించేలా బీసీ సంఘాలన్నీ డిమాండ్ చేస్తున్నాయి. ప్రత్యేకంగా వారికి రిప్రెజెంటేషన్
ఇవ్వాలంటున్నాయి.
మరిన్ని..
నిజామాబాద్లోని బార్డర్ ఏరియాలో ఉంటున్న మరాఠా ప్రతినిధులు.. తమకూ రాష్ట్రంలో రిజర్వేషన్లు కల్పించేలా చూడాలని కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీని కోరుతున్నారు. ఆదిలాబాద్లో విద్యార్థులు.. బాసర ట్రిపుల్ ఐటీని మెరుగుపరచాలన్న డిమాండ్తో రిప్రెజెంటేషన్ ఇచ్చారు. నిజామాబాద్లో బీడీ కార్మికులు, గల్ఫ్ బాధితులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. తమ కోసం ఏదైనా ప్రత్యేకంగా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. జూనియర్ లాయర్లు ఫైనాన్షియల్ ఎయిడ్ కోసం వినతి పెట్టుకున్నారు. లాయర్ల సంఘం కూడా తమ రిప్రెజెంటేషన్ను ఇచ్చింది. రేషన్ డీలర్లు.. తమ కమీషన్ పెంపు కోసం కొద్ది రోజుల క్రితం మేనిఫెస్టో కమిటీని కలిశారు. ఇలా పదుల సంఖ్యలో సంఘాల నుంచి మేనిఫెస్టో కమిటీకి రిప్రెజెంటేషన్లు వెల్లువెత్తుతున్నాయి. కాగా, మేనిఫెస్టో కమిటీలో మాజీ ఎమ్మెల్యే పి.శశిధర్ రెడ్డి, పీసీసీ అధికార ప్రతినిధులు బైకాని లింగం యాదవ్, రియాజ్, పీసీసీ జనరల్ సెక్రటరీ కోటా నీలిమ, మాజీ పీసీసీ సెక్రటరీ అల్లం భాస్కర్లను ప్రత్యేక ఆహ్వానితులుగా పార్టీ నియమించింది. దానికి సంబంధించిన ఆదేశాలను పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ జారీ చేశారు.
రైతుల రిప్రెజెంటేషన్
రైతులకు ప్రత్యేకంగా మేనిఫెస్టోలో పలు అంశాలను చేర్చాలంటూ రైతు సంఘాలూ మేనిఫెస్టో కమిటీని కలుస్తున్నాయి. కన్నెగంటి రవి నేతృత్వంలోని రైతు స్వరాజ్య వేదిక నేతలు ఇటీవలే కమిటీ నేతలతో భేటీ అయ్యారు. కౌలు రైతుల పరిస్థితిని వివరించారు. ఇప్పటికే వరంగల్ రైతు డిక్లరేషన్లో ప్రకటించిన అంశాలను.. మేనిఫెస్టోలో కౌలు రైతుల కోసం ప్రత్యేకంగా పెట్టాలని వారు కోరుతున్నారు. వారికి ఎలాంటి హక్కులు లేకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కౌలు రైతులకు రక్షణ ఉండేలా మేనిఫెస్టోలో అంశాలను చేర్చాలంటున్నారు. మామూలు రైతుల్లాగే వారికీ హక్కులుండేలా కౌలు కార్డులు ఇవ్వాలన్న ప్రతిపాదన ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఉన్నది.