
- ఇప్పటికే నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటున్న వివేక్, పొన్నం
- రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్లతో తుమ్మల సమావేశం.. డివిజన్ ప్రచార బాధ్యతలు అప్పగింత
హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్పెట్టింది. ఇక్కడ పార్టీ అభ్యర్థి గెలుపుకోసం ఇటు సీఎం రేవంత్ రెడ్డి.. అటు పీసీసీ నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో ఫలితమే ఇక్కడ పునరావృతం అయ్యేలా పార్టీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్.. సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్తో కలిసి ప్రత్యేక వ్యూహాలు రచిస్తున్నారు.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం ఇప్పటి నుంచే ముగ్గురు మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్ రావును రంగంలోకి దించారు. పార్టీ ప్రచారం, గెలుపు బాధ్యతలను ఇటు సీఎం.. అటు పార్టీ నాయకత్వం వీరికే అప్పగించడంతో ఈ ముగ్గురు తమదైన శైలిలో నియోజకవర్గంలో వరుస పర్యటనలు చేస్తున్నారు. ప్రజా సమస్యలను తెలుసుకుంటూ.. ప్రజా పాలనపై జనంలో విశ్వాసం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు.
క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న మంత్రులు
గత 15 రోజులుగా నియోజకవర్గంలోని బూత్ స్థాయి నేతలతో మంత్రి వివేక్ వెంకటస్వామి వరుసగా సమావేశం అవుతూ.. కార్యకర్తల్లో జోష్ తీసుకువస్తున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ స్వయంగా ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారు. అధికారులతో మాట్లాడుతూ పలు సమస్యలను అప్పటికప్పుడే పరిష్కరిస్తున్నారు. బోరబండ, షేక్ పేట, యూసఫ్ గూడలాంటి ప్రాంతాల్లో తిరుగుతూ.. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించాలని కోరుతున్నారు. మరో మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా జూబ్లీహిల్స్ రోడ్ నెం 5 ప్రాంతంలో పర్యటించి, ప్రజల సమస్యలను తెలుసుకొని, పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. టికెట్ ఆశిస్తున్న నాయకులను వెంటబెట్టుకొని ఆ ప్రాంతంలో పర్యటిస్తున్నారు. సర్వేలో జనం ఎవరిని విశ్వసిస్తే వారికే టికెట్ అని చెబుతున్నారు. పక్కా లోకల్ నాయకుడికే కాంగ్రెస్ టికెట్ వస్తుందని కాంగ్రెస్ కేడర్లో జోష్ తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరో వైపు మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు కూడా రంగంలోకి దిగారు.
బుధవారం ఆయన తన ఇంట్లో పార్టీ నేతలతో సమావేశమై ఈ ఎన్నికల్లో గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఇందులో మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు పలువురు రాష్ట్ర కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు. 18 మంది రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లను ఈ నియోజకవర్గంలోని డివిజన్లకు ఇన్చార్జీలుగా నియమించారు. ఒక్కో డివిజన్ కు ఇద్దరు చొప్పున పార్టీ ప్రచార బాధ్యతలను తీసుకున్నారు. అభ్యర్థి ఎవరనేది ప్రధానం కాదని, పార్టీ గెలుపుపైనే దృష్టి పెట్టాలని సూచించారు.