
- నల్గొండ జిల్లా తిరుమలగిరిలో చేపట్టిన సర్వేలో అనర్హుల గుర్తింపు
- భూభారతి పైలట్ ప్రాజెక్టు సర్వేలో అక్రమాలు వెలుగులోకి..
- అర్హులైన 4 వేల మందికి త్వరలో పట్టాలిస్తాం: మంత్రి పొంగులేటి
- అధికారులు మానవీయ కోణంలో భూసమస్యలు పరిష్కరించాలని సూచన
హైదరాబాద్, వెలుగు: భూసమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చేపట్టిన ‘భూభారతి’ పైలట్ ప్రాజెక్టు సర్వేలో భారీగా అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని తిరుమలగిరి (సాగర్) మండలంలో నిర్వహించిన సర్వేలో 3 వేల బోగస్ పట్టాలు బయటపడ్డాయి. వీళ్లు ఏండ్ల తరబడి ప్రభుత్వ భూములను అక్రమంగా అనుభవిస్తుండగా, వీళ్లకు గతంలో జారీ చేసిన పట్టాలను రద్దు చేశారు. అర్హులైన 4 వేల మందికి త్వరలో కొత్త పట్టాలు ఇస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. భూసమస్యలను అధికారులు మానవీయ కోణంలో పరిష్కరించాలని సూచించారు.
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని భూసమస్యలపై మంగళవారం సెక్రటేరియెట్లో అటవీ శాఖ మంత్రి కొండా సురేఖతో కలిసి పొంగులేటి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూభారతి పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా తిరుమలగిరి మండలంలో సర్వే నిర్వహించినట్టు తెలిపారు. ‘‘సర్వే కోసం 235 సర్వే నెంబర్లను ఎంపిక చేశాం. మొత్తం 23 వేల ఎకరాల్లో సర్వే నిర్వహించగా, అందులో 12 వేల ఎకరాలు ప్రభుత్వ భూమిగా గుర్తించాం. ఇందులో 8 వేల ఎకరాలు సాగుకు అనుకూలంగా ఉన్నాయి. వీటిలో 4 వేల ఎకరాలు పాసు పుస్తకాలతో సాగులో ఉండగా, మిగిలిన 4,037 ఎకరాలకు సంబంధించి కొత్త పాసు పుస్తకాలు ఇవ్వాల్సి ఉంది. అంతేగాక ఈ సర్వేలో 2,936 ఎకరాలకు సంబంధించి 3,069 మంది వద్ద బోగస్ పాసు పుస్తకాలు ఉన్నట్టు గుర్తించి వారి పాసు పుస్తకాలను రద్దు చేశాం. వీరికి రైతు భరోసా, రైతు బీమా తదితరాలను బంజేశాం” అని తెలిపారు.
గిరిజనులకు భూమిపై హక్కులు..
నాగార్జున సాగర్ నియోజకవర్గంలో 40--–50 ఏండ్లుగా సాగు చేసుకుంటున్న భూములపై గిరిజనులకు హక్కులు కల్పించడానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని పొంగులేటి చెప్పారు. అయితే వివిధ నిబంధనలు చూపుతూ ఆ భూములు అటవీ శాఖకు చెందినవని ఆ శాఖ అధికారులు కొర్రీలు పెడుతున్నారని అన్నారు. ‘‘చిన్న చిన్న సమస్యలను సాకుగా చూపించి భూసమస్యలను జఠిలం చేయవద్దు. ఈ అంశంపై రెవెన్యూ, ఫారెస్ట్ విభాగాలు సమన్వయంతో పనిచేసి వీలైనంత త్వరగా సమస్య పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలి” అని ఆదేశించారు. సర్వేలో భాగంగా 7 వేల ఎకరాలు అటవీ భూమి గుర్తించామని, ఈ భూములకు సంబంధించిన వివాదాలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి కె.జానారెడ్డి, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కె.జయవీర్ రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే బాలూ నాయక్, రెవెన్యూ శాఖ సెక్రటరీ డీఎస్ లోకేశ్ కుమార్, పీసీసీఎఫ్ సి.సువర్ణ, నల్గొండ కలెక్టర్ ఐలా త్రిపాఠి పాల్గొన్నారు.