మన ప్రజాస్వామ్య దేశంలో శాసన వ్యవస్థలు చట్టాలు రూపొందిస్తే... కార్య నిర్వాహకవర్గం వాటిని అమలు చేస్తోంది. రాజ్యాంగ స్ఫూర్తితోపాటు చట్టాలను పరిరక్షించటం, సమీక్షించే అధికారం న్యాయవ్యవస్థకు ఉంది. రాజ్యం పరిధిలో అనేక వ్యవస్థలు ఉన్నప్పటికీ.. న్యాయవ్యవస్థపై ఈ దేశంలోని సామాన్య పౌరుడికి అపారమైన నమ్మకం ఉంటుంది. బాధితుల తరపున కోర్టుల వరకు వెళ్లి న్యాయమూర్తుల ముందు సమస్యను సరైన రీతిలో ఉంచడంలో న్యాయవాది పాత్ర అత్యంత ప్రాధాన్యమైనది. న్యాయవ్యవస్థలో న్యాయవాదిని ఒక సేవకుడిగా, సమాజ మార్పునకు మూలస్తంభంగా భావించొచ్చు.
ప్రభుత్వాలు తీసుకునే ఏకపక్ష నిర్ణయాలను లేదా పౌర హక్కులకు భంగం కలిగించే చట్టాలను కోర్టుల్లో సవాలు చేస్తూ ప్రజాహితాన్ని కాపాడేది వీరే. ప్రజా ప్రయోజన వాజ్యాల (పిల్) ద్వారా ఎన్నో సమస్యలకు పరిష్కారం కూడా చూపిస్తారు. ప్రభుత్వ ఆస్తులు అక్రమణల నుంచి కాపాడేందుకు న్యాయపోరాటం చేస్తుంటారు. న్యాయ వ్యవస్థ అనే రథానికి.. న్యాయమూర్తులు (బెంచ్), న్యాయవాదులు (బార్) రెండు చక్రాల లాంటివారు. ఏ ఒక్క చక్రం సరిగ్గా పనిచేయకపోయినా రథం ముందుకు సాగదు. కానీ ఇటీవల కాలంలో న్యాయవాదులపై దేశవ్యాప్తంగా దాడులు పెరుగుతున్న ధోరణి అత్యంత ఆందోళనకరంగా ఉంది. భౌతిక దాడులు చేయటమే కాకుండా.. ఆఫీసుల్లోకి వెళ్లి మరీ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. ఈ పరిణామాలు న్యాయవాద వృతిపైనే కాదు న్యాయవ్యవస్థపై కూడా ప్రభావం చూపుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.
న్యాయవాదులపై హత్యాకాండ
2021లో పెద్దపల్లి జిల్లాలో అవినీతిపై పోరాడుతున్న లాయర్ దంపతులు గట్టు వామనరావు, పి.వి. నాగమణిలను నడిరోడ్డుపై దారుణంగా హత్య చేసిన ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా బార్ అసోసియేషన్లు చాలాకాలం పోరాటం కూడా చేశాయి. కానీ పరిస్థితులు మారలేదు. ఆ తర్వాత కాలం నుంచి అనేకమంది న్యాయవాదులు దాడులకు గురయ్యారు. కొద్ది నెలల కిందటే చేవెళ్ల కోర్టులో న్యాయవాదిగా పని చేస్తున్న స్వప్న అనే యువ మహిళా న్యాయవాది అత్యంత దారుణంగా హత్యకు గురైంది. అంతేకాదు హైదరాబాద్ నడిబొడ్డున కొద్దిరోజుల కిందటే న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్ను హిట్ అండ్ రన్ ప్లాన్తో హత్య చేసిన ఘోరం బయటిపడింది. క్లయింట్ తరఫున వకాల్తా పుచ్చుకున్న తర్వాత సదరు న్యాయవాది సకాలంలో కోర్టుకు హాజరై వాదనలు వినిపించాల్సి ఉంటుంది. ఎంతో ఒత్తిడితో కూడిన ఈ వ్యవస్థలో తన క్లయింట్కి న్యాయం దక్కే వరకు న్యాయవాది ఎక్కడివరకైనా పోరాడుతాడు. కానీ దాడులు, హత్యలు వంటి ఘటనలు వారి విధుల నిర్వహణపై తీవ్రస్థాయిలో ప్రభావం పడుతోంది.
న్యాయవాదులపై దాడిచేస్తే కఠిన శిక్షలు
న్యాయవాదులపై హింసకు పాల్పడేవారికి, మొదటిసారి నేరానికి పాల్పడితే కనీసం 6 నెలల నుంచి గరిష్టంగా 3 ఏళ్ల వరకు జైలు శిక్ష, రూ. 25,000 నుంచి రూ. 50,000 వరకు జరిమానా విధిస్తారు. రెండోసారి లేదా ఆ తర్వాత కూడా నేరం పునరావృతమైతే కనీసం ఏడాది నుంచి 7 ఏళ్ల వరకు జైలుశిక్ష, అలాగే రూ. 50,000 నుంచి రూ. 1 లక్ష వరకు భారీ జరిమానా ఉంటుంది. ఈ రక్షణ చట్టం కేవలం న్యాయవాదుల రక్షణకే కాకుండా.. దీని దుర్వినియోగాన్ని అడ్డుకునేలా సమతుల్యతను పాటించేలా సర్కార్ ముందస్తు చర్యలు తీసుకోవటం మంచి నిర్ణయం.
ఎవరైనా న్యాయవాది ఈ చట్టంలోని నిబంధనలను ఆసరాగా చేసుకుని కక్షపూరితంగా లేదా తప్పుడు ఫిర్యాదులు చేసినట్లు తేలితే వారికి కూడా 3 ఏళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ. 25,000 జరిమానా విధిస్తారు. న్యాయవాది ఫిర్యాదు చేస్తే అవసరమైన మేర పోలీస్ రక్షణ కల్పించటమనేది చాలా అవసరం. ఇదే విషయంపై తెలంగాణ న్యాయవాదులు ఎంతో కాలంగా పోరాడుతున్నారు.
తాజాగా అమల్లోకి వచ్చిన ఈ చట్టం ప్రకారం ఫిర్యాదు చేసిన అడ్వొకేట్కు రక్షణ కల్పించాల్సిన అవసరం పోలీసులకు ఉంటుంది. అంతేకాకుండా న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి హైకోర్టు ఆధ్వర్యంలో మూడు స్థాయిల్లో (రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, తాలూకా/మండల్ స్థాయి) గ్రీవెన్స్ రెడ్రెస్సల్ కమిటీలను ఏర్పాటు చేసే విషయం కూడా హర్షించదగినది. లాయర్లపై దేశవ్యాప్తంగా దాడులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వమే ప్రత్యేకంగా ఓ చట్టం తేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
తెలంగాణ ప్రభుత్వ చారిత్రక నిర్ణయం
కఠిన పరిస్థితుల్లో కూడా న్యాయవాదులు తమ విధులను నిర్వర్తిస్తున్నారు. మరోవైపు వారి రక్షణ, హక్కుల కోసం చాలా కాలంగా పోరాడుతూనే ఉన్నారు. అడ్వొకేట్స్ ప్రోటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై చాలాకాలంగా ఒత్తిడి తీసుకువస్తున్నారు. కానీ కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రావటం లేదు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఓ అడుగు ముందుకేసి న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేకంగా చట్టాన్ని తీసుకురావటం ఎంతో స్వాగతించదగినది.
సమాజంలో చట్టాన్ని రక్షించే న్యాయవాదులకే రక్షణ కరువవుతున్న ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా చట్టాన్ని అమల్లోకి తీసుకురావటమనేది చారిత్రాత్మక నిర్ణయంగా చూడొచ్చు. రాష్ట్ర ఆవతరణ దినోత్సవం(జూన్ 2) సందర్భంగా ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకురావటం న్యాయవాదుల్లో ఎంతో భరోసా, ధైర్యాన్ని నింపిందనే చెప్పొచ్చు. ఈ చట్టం న్యాయవాదుల రక్షణతో పాటు కొండంత భరోసాని నింపిందనటంలో ఎలాంటి సందేహం లేదు. రాజస్థాన్, కర్నాటక ప్రభుత్వాలు తీసుకువచ్చిన అడ్వొకెట్ ప్రొటెక్షన్ చట్టాల కంటే తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టం మరింత మెరుగ్గా ఉంది.
- నీతికా రోజనాల, న్యాయవాది (రంగారెడ్డి జిల్లా కోర్టు)
