Kukatpally JNTU: కూకట్ పల్లి జేఎన్టీయూ దగ్గర స్కైవాక్.. మెట్రో నుంచి లులు మాల్ వరకు..

Kukatpally JNTU: కూకట్ పల్లి జేఎన్టీయూ దగ్గర స్కైవాక్.. మెట్రో నుంచి లులు మాల్ వరకు..
  • ప్రపోజల్స్​ రెడీ చేస్తున్న హెచ్ఎండీఏ
  • ఇప్పటికే ఉప్పల్లో అందుబాటులోకి..
  • త్వరలోనే ఉపయోగంలోకి మెహిదీపట్నం స్కైవాక్​ 
  • తొలగనున్న పాదచారుల ఇబ్బందులు

హైదరాబాద్​సిటీ, వెలుగు: రోజూ అత్యంత రద్దీగా ఉండే కూకట్ పల్లి జేఎన్​టీయూ జంక్షన్​లో పాదచారులు ఇబ్బందులు పడుతూ రోడ్డు దాటుతుంటారు. ఈ కష్టాలకు చెక్​పెట్టడానికి ఈ ప్రాంతంలో స్కైవాక్​ నిర్మించాలని హెచ్​ఎండీఏ నిర్ణయించింది. ప్రస్తుతం ఉప్పల్​రింగ్​రోడ్​వద్ద నిర్మించిన స్కైవాక్​పాదచారులకు ఎంతో ఉపయోగపడుతోంది. ఈ స్కైవాక్​ద్వారా రోడ్డు దాటడానికి మాత్రమే కాకుండా, కూర్చునేందుకు కూడా ఏర్పాట్లున్నాయి. కాఫీ సెంటర్లు, ఫుడ్​ కోర్టులు ఉన్నాయి. దీంతో సాయంత్రం వేళల్లో ఇక్కడికి వచ్చే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. మెహదీపట్నం వద్ద నిర్మిస్తున్న స్కైవాక్​పై కూడా ఇలాంటి ఏర్పాట్లే చేస్తున్నారు. దీని నిర్మాణం కూడా దాదాపు పూర్తికావచ్చిందని అధికారులు అంటున్నారు. తాజాగా కూకట్​పల్లి జేఎన్​టీయూ వద్ద స్కైవాక్​నిర్మాణంపై అధికారులు దృష్టిపెట్టారు. 

మెట్రో నుంచి లులు మాల్ ​వరకు..
కూకట్​పల్లి జేఎన్​టీయూ నుంచి మెట్రోస్టేషన్​వరకు, తిరిగి అక్కడి నుంచి లులుమాల్​వరకు ఈ స్కైవాక్​ను నిర్మించనున్నట్టు అధికారులు తెలిపారు. దాదాపు ఇది 600 మీటర్లు ఉంటుంది. నిర్మాణానికి ఎంత ఖర్చవుతుందన్న విషయంతో పాటు, పీపీపీ పద్ధతిలో నిర్మించాలా? లేక నేరుగా హెచ్ఎండీఏ ద్వారానే చేపట్టాలా? అనే విషయాలపై అధికారులు అధ్యయనం చేస్తున్నారు. త్వరలో దీనికి సంబంధించి డీటెయిల్డ్​ప్రాజెక్ట్​రిపోర్ట్ (డీపీఆర్​) అందుబాటులోకి వస్తుందని అధికారులు తెలిపారు. త్వరలో సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​పరిసరాల్లోనూ ఓ భారీ స్కైవే నిర్మించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.