పేదల భూములను లాక్కోవడం దారుణం

పేదల భూములను లాక్కోవడం దారుణం

ఖమ్మం: పేదల భూములను లాక్కోవడం దారుణమని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క మండిపడ్డారు. గురువారం జిల్లాలోని కల్లూరులో ‘ రెవిన్యూ భూములపై చట్టపరమైన సమస్యలు, పరిష్కారాలు’ అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీతక్క మాట్లాడుతూ... కాంగ్రెస్ హయాంలో పేదలకు భూములిస్తే... కేసీఆర్ ప్రభుత్వం వాటిని లాక్కుంటుందన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో సామాన్యులకు న్యాయం జరగడంలేదని ఆరోపించారు. పోడు భూములకు శాశ్వత పరిష్కారం కల్పిస్తామని దరఖాస్తులు తీసుకొని నెలలు గడుస్తున్నా... ఇప్పటికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు.  అడవులను రక్షిస్తోన్న ఆదివాసీలపై ఫారెస్ట్ అధికారులు దాడులకు పాల్పడటం దుర్మార్గమన్నారు. పుల్లలేరుకోడానికి వెళ్లిన ఆదివాసీ మహిళలను... పసిపిల్లలున్నారనే కనికరం కూడా లేకుండా జైల్లో పెట్టారని విమర్శించారు. ఆదివాసీలపై దాడులను ఆపకపోతే ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు. ఎకరం పోడు భూమిని కూడా పోనియ్యబోమని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పోడు భూములకు పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు.