నూతన వ్యవసాయ చట్టాన్ని దేశంలోని అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ ఎంపీలు బిల్లును లోక్ సభలో వ్యతిరేకించారని, కానీ టీఆర్ఎస్ మాత్రం ఆ విషయంలో ట్రాన్స్ జెండర్ లా వ్యవహరించిందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. సీఎం కేసీఆర్ నిజంగా ఆ చట్టాన్ని వ్యతిరేకించినట్లైతే లోక్ సభలో చర్చ సందర్భంగా టీఆర్ఎస్ ఎంపీలు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కేంద్ర వ్యవసాయ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆయా అసెంబ్లీల్లో తీర్మానం చేశారని,తెలంగాణలో కూడా అదే తరహాలో ఎందుకు చేయడం లేదని అన్నారు.కేసీఆర్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కేంద్ర వ్యవసాయ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయబోమని చెప్పాలని డిమాండ్ చేశారు.
రైతు సంక్షేమం గురించి మాట్లాడే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు జీవన్ రెడ్డి. క్యాబినెట్ సమావేశంలో సన్నరకాలకు మద్ధతు ధర నిర్ణయిస్తారని ఆశించామని, అయితే సన్నరకం వడ్లను సాగు చేయాలని ప్రోత్సహించిన సర్కారు ఇప్పుడు ఎంత ధర చెల్లిస్తారో చెప్పడం లేదన్నారు. సన్నరకం 20 క్వింటాళ్లకు మించి దిగుబడి రాదని, ప్రతి క్వింటాలుకు 5,6 వందల రూపాయలు నష్టపోతారన్నారు. ఈ లెక్కన జిల్లా రైతులకు 500 నుంచి 600 కోట్ల నష్టపోతారని,దీనికి కేసీఆర్ నైతిక బాధ్యత వహించాలన్నారు.
మొక్కజొన్న రైతులు కూడా తీవ్రంగా నష్టపోతున్నారని, ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తోడు దొంగల్లా తయారయ్యాయన్నారు. క్వింటాలుకు 1850 చొప్పున కొనుగోలు చేయాలన్నారు. అకాల వర్షాలతో పత్తి 5-6 క్వింటాళ్లకు మించి పత్తి దిగుబడి వచ్చే అవకాశం లేదని, పత్తి సాగును ప్రోత్సహించిన సర్కారు రైతులకు జరిగిన నష్టాన్ని ఎలా భర్తీ చేస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. పంట బీమా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ బాధ్యత విస్మరించడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని జీవన్ రెడ్డి అన్నారు.