కరోనా విషయంలో కేసీఆర్ ప్రభుత్వానికి న్యాయస్థానం పలు సార్లు చురకలు అంటించినా.. ఏ మాత్రం మార్పు లేదని అన్నారు కాంగ్రస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. హైకోర్టు హెచ్చరికలతో కరోనా టెస్టులు పెంచుతామని చెప్పి కనీసం సగం కూడా చేయడం లేదన్నారు. కేబినెట్ లో 40వేల టెస్టులు చేస్తామని చెప్పి.. వాటిని అమలు చేయకపోవడం దారుణమన్నారు. ర్యాపిడ్ టెస్టులు కేవలం 50శాతం కి మాత్రమే పరిమితమైందని.. ఆర్టీపీసీఆర్ టెస్టులు కేవలం రోజుకు 30 మాత్రమే చేస్తున్నారన్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ పై వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ హెచ్చరికలు తాటాకు చప్పుళ్లకు మాత్రమే పరిమితం అయిందన్నారు.
నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం కరోనా ట్రీట్మెంట్ ఉచితంగా అందించాలన్నారు జీవన్ రెడ్డి. కరోనా చికిత్సను కేంద్రంలో ఉన్న ఆయుష్మాన్ భారత్ లేదా ఆరోగ్యశ్రీ లో చేర్చాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ అధిపతి గవర్నర్ టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఒప్పుకున్నారు కాబట్టి రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలన్నారు.