హైదరాబాద్, వెలుగు : అమెరికాకు వెళ్లాక రెండ్రోజుల్లో రేవంత్ రెడ్డి అలా ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. తానాలో పాల్గొన్న బాలకృష్ణ, ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రభావమేమైనా పడిందేమోనని ఆయన కామెంట్ చేశారు. హైదరాబాద్లో ఎప్పుడూ కంట్రోల్గానే రేవంత్ మాట్లాడేవారని, కానీ, అమెరికాలో ఎందుకు నోరు జారారోనని అన్నా రు.
మంగళవారం వెంకట్రెడ్డి హైదరాబాద్లోని తన ఇంట్లో మీడియాతో మాట్లాడారు. ‘‘రేవంత్ రెడ్డి అనంగనే మేం 3 గంటల కరెంటే ఇస్తమా? ఈ విష యంలో పీసీసీ నిర్ణయం ఫైనల్ కాదు. పీసీసీ చెప్పింది చెల్లదు. ఏఐసీసీకి, కార్యకర్తలకు మధ్య పీసీసీ కోఆర్డినేటర్ మాత్రమే. రేవంత్ కామెంట్లు వ్యక్తిగత అభిప్రాయాలు. రేవంత్ రెడ్డి ఒక్కడే ఇక్కడ పార్టీ కాదు. మమ్మల్ని కాదని నిర్ణయం తీసుకుంటరా. ఆయనొచ్చాక దానిపై చర్చిస్తం. సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో దీనిపై మాట్లాడిన. ఆయన తిరుపతిలో ఉన్నడు’’ అని అన్నారు. ఉచిత కరెంట్ పథకం తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. ‘‘రాజశేఖర్ రెడ్డి హయాంలో మేనిఫెస్టోలో పెట్టి మరీ 7 గంటలు ఫ్రీ కరెంట్ ఇచ్చినం. రూ.1,300 కోట్ల బకాయిలనూ రద్దు చేసినం. అలాంటి దాన్ని ఎందుకు ఎత్తేస్తం! పకడ్బందీగా 24 గంటల ఉచిత కరెంట్ను అందిస్తం. 24 గంటల్లో 24 సెకన్లు కూడా కరెంట్ పోనియ్యం” అని ఆయన తెలిపారు.
ముందు విద్యుత్ సంస్థల్లో వాళ్లను తీసెయ్యండి
‘‘ముందు విద్యుత్ సంస్థల్లో రిటైర్ అయిన ముసలోళ్లను పదవుల నుంచి తీసెయ్యాలి” అని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి డిమాండ్ చేశారు. ‘‘జెన్కో సీఎండీ ప్రభాకర్రావు 20 ఏండ్ల కింద, రఘుమా రెడ్డి.. 30 ఏండ్ల కింద రిటైర్ అయ్యిన్రు. నలుగురు మోసుకెళ్తేగానీ ఆఫీసులోకి వెళ్లలేని వరంగల్ డిస్కం సీఎండీ గోపాల్ రావు వంటి వాళ్లకు మళ్లీ పదవులిచ్చి రాష్ట్ర ప్రభుత్వం కూర్చోబెట్టింది. ముందు ఆ ముసలోళ్లను తీసేసి.. వంద మంది యువ ఐఏఎస్లు ఖాళీగానే ఉన్నరు కదా.. వారిని నియమించండి. గ్రామాల్లో ఇప్పటికీ పది గంటలు కరెంట్ పోతున్నది. జగదీశ్ రెడ్డి అంటే పవర్ లేని పవర్ మినిస్టర్’’ అనివిమర్శించారు.
కాంగ్రెస్ అంటే రేవంత్ కాదు
సీతక్క సీఎం అని రేవంత్ అనడం పెద్ద జోక్ అని వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధికారం లోకి వచ్చాక ఎమ్మెల్యేలను వన్ టు వన్ అడిగో లేదం టే బ్యాలెట్ పెట్టో అధిష్ఠానం సీఎం క్యాండిడేట్ను నిర్ణయిస్తుందన్నారు. గతంలో హిమాచల్ ప్రదేశ్, కర్నాటక ఎన్నికల్లో ఇదే జరిగిందని తెలిపారు. ‘‘మీటింగ్ పెట్టి సీఎం పదవిని దళితులకు ఇవ్వాల్నా.. గిరిజనులకా.. లేదా బీసీలకు ఇవ్వాలా అన్నది నిర్ణయిస్తారు. గిరిజనులకే కావాలనుకుంటే పొదెం వీరయ్య కూడా మూడో సారి ఎమ్మెల్యే.. 30ఏండ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నడు.
మరి, వీరయ్యకేం తక్కువ. దళితులకు ఇవ్వాలని గతంలో చెప్పినం. దామోదర రాజనర్సింహ, భట్టి విక్రమార్క వంటి వాళ్లూ ఉన్నారు. దళితులకు సీఎం పదవి ఇవ్వాలె.. అది నేను కూడా ఒప్పుకుంటా’’ అని అన్నారు. కానీ, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తనను బాధించాయని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 70 సీట్ల మెజారిటీతో గెలుస్తుందన్నారు. రేవంత్ అంటే కాంగ్రెస్.. కాంగ్రెస్ అంటే రేవంత్ అని అనడం కరెక్ట్ కాదని చెప్పారు.