సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ వెంట ఉన్నవాళ్లంతా తెలంగాణ ఉద్యమ ద్రోహులే అన్నారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఉద్యమ సమయంలో ఉద్యమకారులను కొట్టిన దానం నాగేందర్ ను పార్టీ నుంచి.. కేసీఆర్ ను బండ బూతులు తిట్టిన తలసాని శ్రీనివాస్ యాదవ్కు కేబినెట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహేందర్ రెడ్డి లాంటి ద్రోహులు ఉన్నారని మండిపడ్డారు. మంత్రి మల్లారెడ్డి..పాలు..పూలతో పాటు భూములు కూడా అమ్ముకున్నాడని ఆరోపించారు. మంత్రి పువ్వాడ అజయ్ కు..తెలంగాణ ఉద్యమానికి ఏం సంబంధం ఉందని ప్రశ్నించారు.
లక్ష కోట్లకు ఎదిగాడు..
తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మొదలుపెట్టినప్పుడు కేటీఆర్ అమెరికాలో ఉన్నాడని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గుర్తు చేశారు. రెండో దశ ప్రక్రియ మొదలు కాగానే వచ్చాడు కేటీఆర్ తెలిపారు. తెలంగాణ కోసం కాంగ్రెస్ తో కేసీఆర్ పొత్తు పెట్టుకున్నాడని చెప్పారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఎదిరించి ఆ రోజు తెలంగాణ కోసం తామంతా కొట్లాడామని తెలిపారు. కేసీఆర్ కు చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వకపోవడంతోనే బయటకి వచ్చి పార్టీ పెట్టాడని అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చింది అంటే.... బ్రిటిష్ వాళ్ళు స్వాతంత్రం ఇచ్చినట్టు ఉందంటున్న కేటీఆర్... తెలంగాణ మొదటి శాసన సభలో మీ తండ్రి చెప్పిన మాటలు వినాలని సూచించారు. కేసీఆర్ దీక్ష చూసి తెలంగాణ ప్రకటన రాలేదన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. రాష్ట్రం కోసం విద్యార్థులు చనిపోతున్నారు అని తెలిసి..సోనియా గాంధీ తెలంగాణ ప్రకటన చేశారని చెప్పారు. తెలంగాణ పేరుతో కేటీఆర్.... లక్షల కోట్లకు ఎదిగాడని ఆయన ఆరోపించారు.
సోనియా గాంధీతో గ్రూప్ ఫోటో ఎందుకు దిగినవ్..
సోనియా వల్లే తెలంగాణ వచ్చిందని కేసీఆర్ అన్నారని వెంకట్ రెడ్డి గుర్తుచేశారు. అలాంటి సోనియా గాంధీపై కేటీఆర్ విమర్శలు చేస్తే పాపం తగులుతుందని చెప్పారు. సోనియా గాంధీతో గ్రూప్ ఫోటో ఎందుకు దిగావు అని ప్రశ్నించారు. పనికి రాని మాటలు మాట్లాడకు కేటీఆర్ అని హెచ్చరించారు. ఇంటర్ పేపర్ దిద్దడం రాదు.. టీఎస్పీఎస్సీ పరీక్షలు పెట్టడం రాదు..కానీ..కాంగ్రెస్ పై మాట్లాడుతున్నావా అని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ధ్వజమెత్తారు.
నీ మొకానికి 30 వేల ఇండ్లు కూడ కట్టలె..
కాంగ్రెస్ హయాంలో ఒకే ఇంట్లో ఇద్దరికి పెన్షన్ ఇచ్చామని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గుర్తు చేశారు. 20 ఏండ్ల క్రితం 400 అంటే దాని విలువ ఎంతో తెలుసుకోవాలని కేటీఆర్కు సూచించారు. ఆ రోజుల్లోనే 32 లక్షల ఇండ్లు కట్టించామన్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రతీ నెలా ఒకటో తారీఖునే పింఛన్లు వచ్చేవని తెలిపారు. కానీ కేసీఆర్ హయాంలో టైంకు పింఛన్లు రాకపోగా.... సంక్షేమ పథకాల్లో అవినీతి జరుగుతోందన్నారు. ఇచ్చిన ఒక్క హామీని కూడా కేసీఆర్ సరిగ్గా అమలు చేయలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము కట్టిన ఇల్లు..ఇప్పుడు 10 లక్షల విలువ చేస్తుందన్నారు. 10 ఏండ్లలో కనీసం 30 వేల ఇండ్లు కట్టలేని కేటీఆర్..నువు నీ మొకానికి..కాంగ్రెస్ ను విమర్శిస్తావా అని చురకలంటించారు. కాళేశ్వరం ప్రాజెక్టును డబ్బుల కోసం కట్టారని ఆరోపించారు. పాలమూరు ప్రాజెక్టులో ఒక్క మోటార్ కూడా పెట్టలేదని... ఎస్ఎల్బీసీ టన్నెల్ తాము 70 శాతం పనులు పూర్తి చేశామన్నారు. మరో 2 వేల కోట్లు ఇస్తే పనులు అన్ని పూర్తి అయ్యేవని కానీ...నిధులు మంజూరు చేయలేదన్నారు.
ALSO READ: చంద్రబాబుకు జైలే ఇల్లు.. కోర్టు తీర్పు ఇదే
తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ కేవలం సీఎంకు దట్టీలు కట్టడానికే పనికొస్తాడని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎద్దేవా చేశారు. నాలుగు నెలల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోందని అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కేటీఆర్ కలిసిన తర్వాత కవిత లిక్కర్ కేసు ఆగిపోయిందని ఆరోపించారు. కేటీఆర్కు అసలు నాలెడ్జ్ లేదన్నారు. కేటీఆర్కు రాజకీయాలపై అనుభవం లేదన్నారు.