కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాలకు అభ్యర్థుల ఖరారు

కాంగ్రెస్  పార్టీ అన్ని స్థానాలకు అభ్యర్థుల ఖరారు
  • ఫస్ట్​ లిస్ట్​లో 8 మంది, సెకండ్​ లిస్ట్​లో ఆరుగురిని ఫైనల్​ చేసిన కాంగ్రెస్​ హైకమాండ్​
  • అనూహ్యంగా నారాయణపేట బరిలో పర్ణికా రెడ్డి
  • ఆరు స్థానాల్లో పోటీ చేయనున్న యూత్​ లీడర్లు
  • మూడు సీట్లు బీసీలకు, రెండు చోట్ల మహిళా లీడర్లకు అవకాశం

మహబూబ్​నగర్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచే క్యాండిడేట్లను కాంగ్రెస్  పార్టీ ఫైనల్​ చేసింది. ఈ నెల 15న రిలీజ్​ చేసిన ఫస్ట్​ లిస్ట్​లో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 8 సీట్లకు క్యాండిడేట్లను కన్ఫాం చేయగా.. పోటీ ఎక్కువగా ఉన్న మిగిలిన ఆరు స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల లిస్ట్​ను రిలీజ్​ చేసింది. ఇదే సమయంలో ఈ సెగ్మెంట్లలో టికెట్లు ఆశించిన లీడర్లకు కూడా హామీలు ఇచ్చినట్లు సమాచారం. అలాగే పార్టీ చేపట్టే రెండో విడత బస్సు యాత్రలోనూ స్థానం కల్పించింది.

అభ్యర్థులు వీరే..

కాంగ్రెస్​ పార్టీ హైకమాండ్​ శుక్రవారం రాత్రి ప్రకటించిన సెకండ్​ లిస్ట్​లో వనపర్తి నుంచి మాజీ మంత్రి జిల్లెల చిన్నారెడ్డి, మహబూబ్​నగర్​ నుంచి మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్​రెడ్డి, జడ్చర్ల నుంచి జనంపల్లి అనిరుధ్​రెడ్డి, దేవరకద్ర నుంచి పాలమూరు డీసీసీ అధ్యక్షుడు జి.మధుసూదన్​రెడ్డి(జీఎంఆర్​), మక్తల్​ నుంచి నారాయణపేట డీసీసీ అధ్యక్షుడు వాటికి శ్రీహరి, నారాయణపేట నుంచి దివంగత మాజీ ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి మనుమరాలు చిట్టెం పర్ణికా రెడ్డి పేర్లను ఫైనల్​ చేసింది. అయితే, నారాయణపేట నుంచి జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్​ పోటీ చేస్తారనే ప్రచారం జరిగినా, ఆయన పోటీకి దూరంగా ఉన్నట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఇదే స్థానం కోసం కుంభం శివకుమార్​రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారనే టాక్​ నడిచినా.. అవన్నీ ఊహాగానాలే అని తేలిపోయింది.

ఆయన తన మేనకోడలు పర్ణికారెడ్డికి నారాయణపేట టికెట్​ ఇవ్వాలని గతం నుంచి హైకమాండ్​ వద్ద డిమాండ్​ చేస్తున్నారు. ఫైనల్​గా ఆమెకు టికెట్​ కన్ఫాం కావడంతో ఆయన పోటీలో ఉంటారనేది ఊహాగానమని తేలిపోయింది. సామాజిక సమీకరణల్లో భాగంగా మహబూబ్​నగర్, మక్తల్, దేవరకద్ర స్థానాల్లో ఒక సెగ్మెంట్​ బీసీ లీడర్​కు టికెట్​ ఇవ్వాలనే డిమాండ్​ తెరమీదకు వచ్చింది.

ఈ తరుణంలో మహబూబ్​నగర్​ నుంచి ఎన్పీ వెంకటేశ్, సంజీవ్ ముదిరాజ్, దేవరకద్ర  నుంచి ప్రదీప్​కుమార్​ గౌడ్​, మక్తల్ నుంచి శ్రీహరి పేర్లను హైకమాండ్​ పరిశీలించగా, చివరగా మక్తల్ స్థానాన్ని బీసీలకు కేటాయించింది. దీంతో పాలమూరు, దేవరకద్ర స్థానాల నుంచి యెన్నం, జీఎంఆర్​లకు పోటీకి లైన్​ క్లియర్​ అయ్యింది. అలాగే మక్తల్​ స్థానం కోసం మాజీ ఎమ్మెల్యే సీతమ్మ, మాజీ డీసీసీబీ చైర్మన్​ వీరారెడ్డి కుమారుడు ప్రశాంత్​రెడ్డి తదితరులు పోటీ పడినా అవకాశం దక్కలేదు.

వనపర్తి నుంచి యూత్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు శివసేనారెడ్డి, ఇటీవల బీఆర్ఎస్​ నుంచి కాంగ్రెస్​లో చేరిన పెద్దమందడి ఎంపీపీ మేఘారెడ్డి టికెట్​ కోసం ప్రయత్నించినా, ఫైనల్​గా హైకమాండ్​ చిన్నారెడ్డికే అవకాశం ఇచ్చింది. టికెట్ల కోసం పోటీ పడిన నేతలను బుజ్జగించేందుకు హైకమాండ్​ పలు హామీలు కూడా ఇచ్చినట్లు సమాచారం. 

ముగ్గురు బీసీలు.. ఇద్దరు మహిళలు..

ఉమ్మడి జిల్లాలో బీసీ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉండడంతో మూడు సీట్లను బీసీలకు కేటాయించింది. ఫస్ట్​ లిస్టులో గద్వాల స్థానాన్ని సరిత తిరుపతయ్య, షాద్​నగర్​ నుంచి వీర్లపల్లి శంకర్​ పేరును ఫైనల్​ చేసింది. రెండో లిస్ట్​లోనూ మక్తల్​ నుంచి ​ శ్రీహరికి బీసీ కోటా కింద అవకాశం కల్పించింది. అలాగే ఇద్దరు మహిళా లీడర్లకు చాన్స్​ఇచ్చింది. ఫస్ట్​ లిస్ట్​లో సరిత ఉండగా, సెకండ్​ లిస్టులో పర్ణికారెడ్డి పేరును ప్రకటించింది. రూలింగ్​ పార్టీ ఉమ్మడి జిల్లాల్లోని 14 స్థానాల్లో ఒక్క మహిళకు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి అవకాశం ఇవ్వకపోవడం గమనార్హం.

పాలమూరులో బస్సు యాత్ర-–2

ఎలక్షన్ల నేపథ్యంలో కాంగ్రెస్​ హైకమాండ్​ ఉమ్మడి జిల్లాల్లో బస్సు యాత్రలు నిర్వహిస్తోంది. ఇప్పటికే ఫస్ట్​ ఫేస్​ యాత్ర ముగియగా, సెకండ్​ ఫేస్​ను శనివారం నుంచి ప్రారంభించనుంది. 17 నియోజకవర్గాల్లో ఈ యాత్ర సాగనుండగా, అందులో 31న కొల్లాపూర్​, నవంబర్​ ఒకటిన కల్వకుర్తి, జడ్చర్ల నియోజకవర్గాల మీదుగా ఈ యాత్ర వెళ్లనుంది. కొల్లాపూర్​లో జరిగే సభకు ప్రియాంక గాంధీ హాజరు కానుండగా, జడ్చర్ల సభకు రాహుల్​ గాంధీ హాజరయ్యే అవకాశాలున్నట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. అక్కడి నుంచి షాద్​నగర్​కు యాత్ర వెళ్లనుండగా, అక్కడి నుంచి కొంత దూరం పాదయాత్ర చేయనున్నట్లు సమాచారం.

బరిలో ఆరుగురు యూత్​ లీడర్లు..

ఉమ్మడి జిల్లాల్లోని 14 స్థానాలకు గాను ఆరు స్థానాల్లో కాంగ్రెస్​ హైకమాండ్​ యూత్ లీడర్లకు అవకాశం కల్పించింది. వీరంతా మొదటి సారిగా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచి, తమ అదృష్టాన్ని పరిక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. ఇందులో జడ్చర్ల నుంచి అనిరుధ్​రెడ్డి, దేవరకద్ర నుంచి జీఎంఆర్, గద్వాల నుంచి సరిత, మక్తల్​ నుంచి శ్రీహరి, నారాయణపేట నుంచి పర్ణిక, నాగర్​కర్నూల్​ నుంచి రాజేశ్​రెడ్డి ఉన్నారు. వీరంతా పదేండ్లుగా అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు సి.లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్​రెడ్డి, చిట్టెం రాంమోహన్​రెడ్డి, సుంకిని రాజేందర్​రెడ్డి, మర్రి జనార్దన్​రెడ్డిలపై పోటీ చేయనున్నారు.