మాదే సంస్కారవంతమైన పరిపాలన

మాదే సంస్కారవంతమైన పరిపాలన

నాగర్​కర్నూల్, వెలుగు: ‘‘యాభై ఏండ్లపాటు కాంగ్రెస్​ పార్టీ దేశాన్ని పాలించింది.. ఇప్పుడు మరొక చాన్సివ్వాలని రాహుల్​ గాంధీ అడుగుతున్నడు. ఈ యాభై ఏండ్లలో నెహ్రూ నుంచి సోనియా​వరకు ఏం ఉద్ధరించారు, మళ్లీ ఎందుకు చాన్సివ్వాలో ఆయన ప్రజలకు చెప్పాలి” అని మంత్రి కేటీఆర్​ డిమాండ్​ చేశారు. తాగడానికి నీళ్లు, సాగుకు కరెంటు ఇవ్వక జనాలను సావగొట్టింది సరిపోదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్​ పార్టీకి కాలం చెల్లిందని మంత్రి చెప్పారు. రాహుల్​ గాంధీని గంటల తరబడి ఈడీ ఆఫీసులో కూర్చోబెట్టినా పట్టించుకునే దిక్కేలేదని ఎద్దేవా చేశారు. కుల పిచ్చితో కాంగ్రెస్​పార్టీ, మత పిచ్చితో బీజేపీ.. దేశాన్ని నాశనం చేస్తున్నాయని ఆరోపించారు. శనివారం నాగర్​ కర్నూల్​ జిల్లాలో పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల కార్యక్రమాల్లో మంత్రి కేటీఆర్​ పాల్గొన్నారు. ఆ తర్వాత జరిగిన సభలో బీజేపీ, కాంగ్రెస్​ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. టీఆర్ఎస్ సంస్కారవంతమైన పరిపాలన అందించే పార్టీ అని మంత్రి చెప్పారు. కాంగ్రెస్​ పార్టీకి చరిత్రే తప్ప భవిష్యత్తు లేదన్నారు. హిందూ ముస్లింల మధ్య పంచాయితీ పెట్టి, విద్వేషాలను రెచ్చగొట్టి దేశంలో బీజేపీ అశాంతిని సృష్టిస్తోందని మంత్రి మండిపడ్డారు. కృష్ణా జలాల్లో మన రాష్ట్ర వాటాను కేంద్రం ఎందుకు తేల్చడంలేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిరంజన్​ రెడ్డి, శ్రీనివాస్​ గౌడ్, ఎమ్మెల్యేలు బీరం హర్షవర్దన్​ రెడ్డి, మర్రి జనార్దన్​ రెడ్డి, ఆల వెంకటేశ్వర్​ రెడ్డి, లక్ష్మారెడ్డి, జైపాల్ యాదవ్, రాజేందర్​ రెడ్డి, అబ్రహాం, ఎంపీ రాములు, ఎమ్మెల్సీలు కూచుకుళ్ళ దామోదర్​ రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి, గోరటి వెంకన్న, సురభి వాణిదేవి, జెడ్పీ చైర్మన్​ పద్మావతి తదితరులు పాల్గొన్నారు.

జూపల్లి ఇంటికి వెళ్లిన కేటీఆర్‌‌

మీటింగ్​ పూర్తయిన తర్వాత మంత్రి కేటీఆర్ మిగతా మంత్రులతో కలిసి​జూపల్లి ఇంటికి వెళ్లారు. ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్​ రెడ్డితో విభేదాల వల్ల శనివారం జరిగిన కార్యక్రమాలకు జూపల్లి హాజరుకాలేదు. దీంతో మంత్రి కేటీఆర్​ వెళ్లి జూపల్లిని కలిశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే తమపై కక్ష సాధిస్తున్నారని, తమపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని జూపల్లి అనుచరులు మంత్రి కేటీఆర్​దగ్గర వాపోయారు.

కేటీఆర్​ కాన్వాయి అడ్డగింత

మంత్రి కేటీఆర్​ కాన్వాయిని బీజేపీ, కాంగ్రెస్​ నేతలు అడ్డుకున్నారు. నాగర్​ కర్నూల్​ నుంచి బిజినేపల్లికి వెళ్తుండగా వెంకటాపూర్​వద్ద ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చి కాన్వాయ్​ను అపేశారు. పోలీసులు వారిని అరెస్టు చేసి మంత్రి కాన్వాయ్​కి దారిచ్చారు. వాస్తవానికి మంత్రి పర్యటన నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్​ పార్టీల నేతలు పలువురిని ముందస్తుగానే పోలీసులు అరెస్టు చేశారు.