బీజేపీకి కేసీఆర్ ఆదర్శ పురుషోత్తముడు

బీజేపీకి కేసీఆర్ ఆదర్శ పురుషోత్తముడు

ఉప ఎన్నికలతోనే అభివృద్ధి జరుగుతుందంటే..తక్షణమే  బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలని కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. నలుగురు బీజేపీ ఎంపీలు రాజీనామా చేస్తే 28 నియోజకవర్గాలో అభివృద్ధి జరుగుతుందన్నారు. కేవలం వేల కోట్ల కాంట్రాక్ట్ ల కోసమే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి బీజేపీ లోకి వెళ్ళాడని పేర్కొన్నారు.  కాంగ్రెస్ కు ఓటేసి టీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలన్నారు. బీజేపీకి ఆదర్శ పురుషోత్తముడు కల్వకుంట్ల చంద్రశేఖరుడని విమర్శించారు.  కేసీఆర్.. తెలంగాణను ఒక విష ప్రయోగశాలగా మార్చారని మండిపడ్డారు. బీజేపీ, టీఆర్ఎస్ తోడు దొంగలుగా మారారన్నారు. సర్పంచ్ లు, ఎంపీటీసీలు రూ.40 లక్షలు, 50 లక్షలకు అమ్ముడుపోతున్నారని ఆరోపించారు. అమ్ముడుపోయిన వాళ్లంతా అభివృద్ధి అని అంటున్నారని... ప్రజాస్వామ్యం గెలవాలంటే కాంగ్రెస్ గెలవాలన్నారు.

ప్రజలంతా మునుగోడు వైపు చూస్తున్నారు..

తెలంగాణ ప్రజలంతా ఇవాళ మునుగోడు వైపు చూస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. ఇది ఒక ప్రత్యేక సందర్భమని అని..ఈ ప్రాంతానికి ఒక చరిత్ర ఉందన్నారు.  రాష్ట్రం ఏర్పడినా పాలకుల నిర్లక్ష్యం వల్ల నల్గొండలో ఫ్లోరైడ్ సమస్య తీరలేదన్నారు. 8 ఏళ్లైనా ఫ్లోరైడ్ సమస్యకు  కేసీఆర్ పరిష్కారం చూపించలేదన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో హామీలిచ్చినా నెరవేర్చలేదన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లు,  దళితులకు మూడెకరాల భూమి, ఇంటికో ఉద్యోగం, రైతుకు రూ.లక్ష రుణమాఫీ వంటి హామీలు నెరవేర్చలేదన్నారు. డిండీకి నిధులిస్తే ప్రతీ గ్రామానికి నీళ్ళొస్తాయన్నారు. మునుగోడు నియోజకవర్గంలో ఇంటింటికీ మిషన్ భగీరథ నీళ్ళు లేవు కానీ .. ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులు పెట్టి  చీప్ లిక్కర్ ను కేసీఆర్ అందించాడని రేవంత్ అన్నారు. మునుగోడును చీప్ లిక్కర్ కు అడ్డాగా మార్చారన్నారు. ‘‘నాయకులను కేసీఆర్ కొనుగోలు చేస్తున్నాడు  అని ఆరోపిస్తున్న బీజేపీ.. ఇప్పుడు మునుగోడు సర్పంచులను,నాయకులను అంగడిలో వస్తువులా కొంటోంది’’ అని రేవంత్ వ్యాఖ్యానించారు.