- ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ, వెలుగు: దశాబ్దాలుగా వెనకబడిన వేములవాడ కాంగ్రెస్ హయాంలో ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతోందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం వేములవాడ పట్టణంలో పార్టీ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు అవకాశం ఇచ్చిన వేములవాడ పట్టణాన్ని అభివృద్ధి చేయలేదని, ఇప్పుడు కాంగ్రెస్కు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. పట్టణంలో ఇళ్లు లేని 2,500 మందికి ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చే బాధ్యత తనదన్నారు.
54 యేళ్లుగా పట్టణ ప్రజలు ఎదురు చూస్తున్న రోడ్డు వెడల్పు పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. రాజన్న ఆలయ, పట్టణ అభివృద్ధి ఓడెద్దులా ముందుకు సాగుతోందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉందని, వేములవాడలో ఎమ్మెల్యే గా మీ బిడ్డగా తాను ఉన్నానని, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరేయాలని కోరారు.
