హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలని, కార్మికులకు పీఆర్సీ ఇవ్వాలని మాజీ మంత్రి హరీశ్ రావు ఉచిత సలహాలు ఇస్తూ సీఎం రేవంత్ రెడ్డికి రాసిన లేఖ హాస్యాస్పదంగా ఉందని కాంగ్రెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఈ సమస్యలపై మాజీ సీఎం కేసీఆర్ కు లేఖ రాసే ధైర్యం ఎందుకు చేయలేదని ఆయన ప్రశ్నించారు. సోమవారం గాంధీ భవన్ లో మీడియాతో నిరంజన్ మాట్లాడారు.
బస్సుల్లో రద్దీ పెరగడం, 2 వేల బస్ లు కొనాలని అడుగుతున్నారంటే మహాలక్ష్మి ఫ్రీ జర్నీ స్కీమ్ సక్సెస్ అయిందని హరీశ్ ఒప్పుకున్నట్లే అని ఆయన పేర్కొన్నారు. 2019 అక్టోబర్ 4 నుంచి 25 రోజుల పాటు ఆర్టీసీ సిబ్బంది సమ్మె చేసినప్పుడు ఆర్టీసీ కార్మికులపై ఎంత కఠినంగా వ్యవహరించారో ఒకసారి గుర్తు తెచ్చుకోవాలని సూచించారు. సమ్మె విరమణ తరువాత 2 రోజులు కార్మికులను డ్యూటీలో జాయిన్ కానివ్వలేదని, సమ్మె కంటిన్యూ చేస్తే ఉద్యోగాలు పోతాయని బెదిరించారని నిరంజన్ గుర్తుచేశారు.