పెండింగ్ ఎంపీ సీట్లపై కాంగ్రెస్ క్లారిటీ!

పెండింగ్ ఎంపీ సీట్లపై కాంగ్రెస్ క్లారిటీ!
  • ఖమ్మం అభ్యర్థిగా రఘురామరెడ్డి, కరీంనగర్- వెలిచాల రాజేందర్ రావు, హైదరాబాద్- షమీర్ ఉల్లా
  • ఇయ్యాల ప్రకటిస్తారంటున్న కాంగ్రెస్ నేతలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మూడు పెండింగ్​ పార్లమెంట్​ సీట్లపై ఏఐసీసీ స్పష్టత ఇచ్చినట్టు కాంగ్రెస్​ వర్గాలు పేర్కొంటున్నాయి. బుధవారం అధికారికంగా ప్రకటించనున్నట్టు పార్టీ నేతలు చెప్తున్నారు. అభ్యర్థులు ఎవరనేది హైకమాండ్ ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు ఇచ్చిందని, ప్రకటనే తరువాయి అని నేతలు అంటున్నారు. 

పార్టీ వర్గాలు చెప్తున్న దాని ప్రకారం.. ఖమ్మం నుంచి మాజీ ఎంపీ, పాత తరం కాంగ్రెస్ నేత రామసహాయం సురేందర్ రెడ్డి కొడుకు, ప్రముఖ పారిశ్రామికవేత్త రఘురామరెడ్డి, కరీంనగర్ నుంచి మాజీ ఎమ్మెల్యే వెలిచాల జగపతి రావు కొడుకు రాజేందర్ రావు, హైదరాబాద్ నుంచి పార్టీ జిల్లా అధ్యక్షుడు షమీర్ ఉల్లా పేర్లను హైకమాండ్ ఫైనల్ చేసింది. ఇప్పటికే వెలిచాల రాజేందర్ రావు, రఘురామరెడ్డి తరఫున మంత్రి పొంగులేటి అనుచరులు నామినేషన్లు దాఖలు చేయగా, షమీర్ ఉల్లా బుధవారం నామినేషన్ వేయనున్నారు.

వెలిచాల రాజేందర్ రావు తమ పార్టీ అభ్యర్థి అని  కరీంనగర్ లో ఆ నియోజకవర్గ ఇన్​చార్జి అయిన మంత్రి పొన్నం ప్రభాకర్​ ప్రకటించారు. వీరి అభ్యర్థిత్వాలు బుధవారం ప్రకటించగానే, అదే రోజు సాయంత్రం వారికి బీ ఫామ్ లు అందజేయనున్నట్టు సమాచారం. గురువారం మధ్యాహ్నం 3 గంటలలోపు బీ ఫామ్ లు అందజేసే అవకాశం ఉన్నది.