హైదరాబాద్: వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 100 సీట్లు గెలుస్తుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారని అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుపు ఖాయం కావడంతో నిజామాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను నేరవేరుస్తున్నామన్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపు కాంగ్రెస్ పాలనకు నిదర్శమని పేర్కొన్నారు. ఇది కాంగ్రెస్ కార్యకర్తల విజయమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ వరుస విజయాలు సాధిస్తోందన్నారు. వచ్చే 8 ఏండ్లు తెలంగాణలో మేమే అధికారంలో ఉంటామని ధీమా వ్యక్తం చేశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటింగ్ శాతం తక్కువ నమోదు కావడం అవ్వడం బాధాకరమన్నారు. ఓటింగ్ శాతం తగ్గడం మంచి పరిణామం కాదని అన్నారు. యువత ఓటు హక్కును వినిగించుకోలేదన్నారు. ఓటు హక్కు వినియోగించుకోవాలని.. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ఎంతో విలువైనదని తెలిపారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ను ఓడించేందుకు బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు అయ్యాయని ఆరోపించారు. బీఆర్ఎస్ గెలుపు కోసం బీజేపీ పని చేసిందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒక్కటైనా.. కాంగ్రెస్ పార్టీ మంచి మెజార్టీతో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విజయం కాంగ్రెస్ కార్యకర్తలకు అంకితం ఇస్తామని ప్రకటించారు.
