హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో దూసుకుపోతుంది. రౌండ్ రౌండ్కు మెజార్టీ పెంచుకుంటూ పోతుంది. రెండో రౌండ్లో కాంగ్రెస్ 9,691, బీఆర్ఎస్ 8,609 ఓట్లు సాధించాయి. రెండో రౌండ్ ముగిసే సరికి కాంగ్రెస్ పార్టీ 1144 ఓట్ల లీడ్లో కొనసాగుతోంది. ఫస్ట్ రౌండ్లో కూడా కాంగ్రెస్ ఆధిక్యం సాధించింది. తొలి రౌండ్లో అధికార పార్టీకి 62 ఓట్ల మెజార్టీ దక్కింది. ఈవీఎంల కంటే ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కాంగ్రెస్ 39, బీఆర్ఎస్ 36, బీజేపీకి 10 ఓట్లు పడ్డాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కాంగ్రెస్ పార్టీకి స్వల్ప ఆధిక్యం సాధించింది.
- జూబ్లీహిల్స్ కౌంటింగ్ : 2 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తి
- 1,144 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్
- వెనకంజలో ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థి సునీత
- రెండు రౌండ్లలో వచ్చిన ఓట్లు
- కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ : 18,617
- బీఆర్ఎస్ అభ్యర్థి సునీత : 17,473
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ శుక్రవారం (నవంబర్ 14) ఉదయం 8 గంటల నుంచి యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో కౌంటింగ్ మొదలైంది. ఓట్ల లెక్కింపుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కౌంటింగ్ కేంద్ర దగ్గర 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు భారీగా బందోబస్తు మోహరించారు.
మొత్తం 10 రౌండ్లలో కౌంటింగ్చేపట్టనున్నారు. గంట గంటన్నర లోపు ట్రెండ్తెలిసే అవకాశం ఉంది. ఉదయం 11.30 గంటల వరకు విజయం ఎవరిదనే దానిపై క్లారిటీ రావొచ్చని ఎన్నికల అధికారులు తెలిపారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో అనివార్యమైన ఈ ఉప ఎన్నికలో.. విజయం కోసం ప్రధాన పార్టీలు సర్వశక్తులు ఒడ్డి పోరాడాయి. ఈ నెల 11న పోలింగ్జరుగగా.. 48.49 శాతం ఓటింగ్నమోదైంది.
ఈ ఉప ఎన్నికలో 59 మంది అభ్యర్థులు (నోటాతో కలిపి) పోటీలో ఉన్నందున, 42 కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేశారు. మొత్తం ప్రక్రియ గరిష్టంగా 10 రౌండ్లలో పూర్తయ్యే అవకాశం ఉందని, లెక్కింపు పనులను ఈసీ సాధారణ పరిశీలకులు పర్యవేక్షించనున్నారని, 186 మంది సిబ్బందిలో సూపర్వైజర్లు, అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లు నియమించామని ఎన్నికల అధికారులు తెలిపారు.
అప్డేట్స్ను ఎల్ఈడీ స్క్రీన్లు, ఈసీ యాప్ ద్వారా అందుబాటులో ఉంచుతామన్నారు. కౌంటింగ్ సెంటర్లోకి అభ్యర్థులు, వారి ఎన్నికల ప్రతినిధులు, అనుమతిచ్చిన కౌంటింగ్ ఏజెంట్లకు మాత్రమే ప్రవేశం ఉంటుందని స్పష్టం చేశారు. ఇతరులెవరికీ అనుమతి ఉండదని చెప్పారు. కౌంటింగ్ సెంటర్ పరిసరాల్లో సెక్షన్ 144 అమలులో ఉంటుందని, ఉల్లంఘనలపై చర్యలు తప్పవని సీఈవో హెచ్చరించారు.
