
బెంగళూరు.. ఈ మాట వినగానే మహా నగరం అనే కంటే.. మహా ట్రాఫిక్ అనటం కామన్. ఇంటి నుంచి ఆఫీసులకు బయలుదేరినోళ్లు లంచ్ టైంకి చేరటం చాలా సందర్భాల్లో వినే ఉంటాం.. సాయంత్రం ఆఫీసుల నుంచి ఇంటికి బయలుదేరిన వారు రాత్రి భోజనం టైంకి చేరుతుంటారు. గంటలకొద్దీ ట్రాఫిక్ లో ఇరుక్కునే వాహనాలదారులు.. తమ పనులు అన్నీ కార్లలోనే చక్కబెట్టుకోవటం చూస్తున్నాం.. ఇటీవల కాలంలో బెంగళూరు ట్రాఫిక్ అనేది పెద్ద సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే కర్నాటక కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. బెంగళూరు సిటీలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు మహా పథకాన్ని అమలు చేస్తోంది.
బెంగళూరు నగరంలో ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించే దిశలో 190 కిలోమీటర్ల మేరకు టన్నెల్ రోడ్ల నిర్మాణం చేపట్టాలని సిద్ధరామయ్య సర్కార్ నిర్ణయించింది. ఇదే విషయంపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సచివాలయంలో మాట్లాడారు. టన్నెల్ రోడ్ల నిర్మాణాల కోసం 8 కంపెనీలు అర్హత పొందాయని, పీజబులిటీ రిపోర్టు అందిన తర్వాత 45 రోజుల్లోగా టెండర్ ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు.
బెంగళూరు నగరంలో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు కారిడార్లను అభివృద్ధి చేయాలని టెండర్లు ఆహ్వానించామన్నారు డీకే శివకుమార్. ఇందులో భాగంగానే రహదారుల విస్తరణ, సొరంగ రహదారుల నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వానికి పలు కీలకమైన సలహా సూచనలు వచ్చాయని వివరించారు. కారిడార్ల నిర్మాణానికి సంబంధించి అంతార్జాతీయ స్థాయిలో టెండర్లు ఆహ్వానించగా 9 కంపెనీలు పాల్గొన్నాయన్నారు. వీటితో పాటే టన్నెల్ రహదారుల ప్రక్రియను కూడా ఏకకాలంలో ప్రారంభించే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందన్నారు.
టన్నెల్ రోడ్లను 4 మార్గాలుగా నిర్మించాలా..? 6 మార్గాలకుగా నిర్మించాలా..? ఎక్కడ ప్రారంభించి ఎక్కడ పూర్తిచేయాలి..? బెంగళూరు నగరమంతటా వీటిని నిర్మించాలా అనే అంశంపై నిపుణుల నుంచి నివేదిక కోరామన్నారు. ఈ పథకం అమలైతే భారీగా నిధులు అవసరం కానున్నాయని, అందువల్లే దశలవారీగా చేపట్టాలనే ఆలోచన కూడా ఉందన్నారు. టన్నెల్ రోడ్ల నిర్మాణ రంగంలోనూ పలు కంపెనీల నుంచి పెట్టుబడులను ఆకర్షించే అంశం పరిశీలనలో ఉందన్నారు.
ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉండే బళ్ళారి రోడ్డు, పాత మదరాసు రోడ్డు, ఎస్టి.మాల్ జంక్షన్ నుంచి మెఖ్రి సర్కిల్వరకు, సర్జాపుర రోడ్డు, హొసూరు రోడ్డు, కనకపుర రోడ్డు, యశ్వంతపుర రోడ్డు, కెఆర్పురం, సిల్క్బోర్డు వంటి ప్రదేశాలను టన్నెల్ రోడ్ల నిర్మాణం కోసం పరిశీలిస్తున్నామన్నారు. టన్నెల్ తవ్వేందుకు పెద్ద యంత్రాలను ముంబై, ఢిల్లీ నుంచి తెప్పించాల్సిన అవసరం ఉందన్నారు.