పాతది రద్దాయె..  కొత్తది రాకపాయె..కలగా మిగిలిన గోదావరిపై హైలెవల్ బ్రిడ్జి

పాతది రద్దాయె..  కొత్తది రాకపాయె..కలగా మిగిలిన గోదావరిపై హైలెవల్ బ్రిడ్జి
  • 2018లో మంచిర్యాల-అంతర్గాం బ్రిడ్జి సాంక్షన్​ చేసిన సర్కారు 
  • పనులు స్టార్ట్ అయ్యాక కాన్సల్​చేయించిన ఎమ్మెల్యే పీఎస్సార్​ 
  • ముల్కల్ల–ముర్మూర్​ మధ్య మరో బ్రడ్జికి రూ.450 కోట్లతో ప్రపోజల్స్
  • పాతది రద్దయి ఏడాదవుతున్నా కొత్త బ్రిడ్జి కోసం ఎదురుచూపులే 

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల మధ్య గోదావరి నదిపై హైలెవల్​బ్రిడ్జి నిర్మాణం కలగా మిగిలింది. ఈ బ్రిడ్జి నిర్మాణంతో రెండు జిల్లా కేంద్రాల నడుమ దూరం తగ్గడమే కాకుండా రవాణా సౌకర్యం మరింత మెరుగవుతుంది. కానీ ప్రజాప్రతినిధుల తీరుతో ఎనిమిదేండ్లుగా ఎలాంటి ప్రోగ్రెస్​ లేకుండా పోయింది.

ఎనిమిదేండ్ల క్రితం మంచిర్యాల–అంతర్గాం బ్రిడ్జిని సాంక్షన్​ చేసిన బీఆర్ఎస్ సర్కారు ఆ తర్వాత పట్టించుకోలేదు. అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్​ గవర్నమెంట్ ​కొత్తది కడుతామంటూ పాత బ్రిడ్జిని క్యాన్సల్​ చేసింది. నేటికి ఏడాదవుతున్నా ముందడుగు పడకపోవడంతో రోజురోజుకు ఆశలు సన్నగిల్లుతున్నాయి. 

ఎనిమిదేండ్ల క్రితం సాంక్షన్ 

మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలను కలుపుతూ గోదావరిపై హైలెవల్​ బ్రిడ్జి నిర్మించాలని చాలాకాలంగా డిమాండ్ ఉంది. ఈ క్రమంలో 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అప్పటి సీఎం కేసీఆర్​రూ.125 కోట్లతో మంచిర్యాల–అంతర్గాం బ్రిడ్జిని సాంక్షన్​చేస్తున్నట్టు ప్రకటించారు. రెండోసారి బీఆర్ఎస్​గవర్నమెంట్​ అధికారంలోకి వచ్చి కేసీఆర్​ మళ్లీ సీఎం అయినప్పటికీ బ్రిడ్జికి మోక్షం కలగలేదు.

ప్రజలు, ప్రతిపక్షాల నుంచి విమర్శలు రావడంతో 2023 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నాలుగేండ్ల క్రితం పనులకు గ్రీన్​సిగ్నల్​ఇచ్చారు. అంచనా వ్యయాన్ని రూ.125 కోట్ల నుంచి రూ.164 కోట్లకు పెంచి టెండర్​కాల్​చేయగా వల్లభనేని కన్​స్ట్రక్షన్స్​ కాంట్రాక్ట్​దక్కించుకుంది. వెంటనే సాయిల్ ​టెస్టింగ్ చేసి బ్రిడ్జి వర్క్​స్టార్ట్​ చేసింది. అయితే ఆ సంస్థ ఇతర ప్రాంతాల్లో చేసిన పనులకు సంబంధించిన బిల్లులను అప్పటి ప్రభుత్వం చెల్లించకపోవడంతో ఈ బ్రిడ్జి పనులను నిలిపివేసింది. 

రూ.450 కోట్లతో మరో బ్రిడ్జికి ప్రపోజల్స్

2023 ఎన్నికల్లో కాంగ్రెస్ ​గవర్నమెంట్​అధికారంలోకి రావడం, మంచిర్యాల ఎమ్మెల్యేగా కె.ప్రేమ్​సాగర్​రావు గెలవడంతో మంచిర్యాల–అంతర్గాం బ్రిడ్జికి బ్రేక్​ పడ్డది. ఈ బ్రిడ్జి నిర్మాణంతో మంచిర్యాల, పెద్దపల్లి మధ్య దాదాపు 18 కిలోమీటర్ల దూరం తగ్గుతున్నప్పటికీ హెవీ వెహికల్స్​మంచిర్యాల టౌన్​నుంచి రాకపోకలు సాగించాల్సి ఉంటుంది.

దీంతో జిల్లా కేంద్రంలో ట్రాఫిక్​ రద్దీ పెరగడం, కాలేజ్​ రోడ్​ఇరుకుగా ఉండడం, ​రైల్వే ఓవర్​బ్రిడ్జి(ఆర్వోబీ) దగ్గర సమస్యలు తలెత్తే అవకాశం ఉండడం వల్ల ఈ బ్రిడ్జిని రద్దు చేస్తున్నట్టు ఎమ్మెల్యే పీఎస్సార్​ ప్రకటించారు. ఈ మేరకు నిరుడు మార్చిలో బ్రిడ్జిని క్యాన్సల్ చేస్తూ అప్పటి గవర్నమెంట్ స్పెషల్​ చీఫ్​ సెక్రటరీ వికాస్​రాజ్ ​ఆర్డర్స్​ జారీ చేశారు. దీనికి ప్రత్యామ్నాయంగా ముల్కల్ల, ముర్మూర్​నడుమ గోదావరిపై రూ.450 కోట్ల అంచనాతో మరో హైలెవల్​బ్రిడ్జి నిర్మాణానికి ప్రపోజల్స్​రెడీ చేశారు. ఆ తర్వాత ఎలాంటి ప్రోగ్రెస్​ లేకపోవడంతో రెండు జిల్లాల ప్రజలకు ఎదురుచూపులే మిగిలాయి. 

బ్రిడ్జి నిర్మాణంతో తగ్గనున్న దూరాభారం

మంచిర్యాల, పెద్దపల్లి మధ్య దూరాభారం తగ్గించడం కోసమే మంచిర్యాల–అంతర్గాం బ్రిడ్జిని గత ప్రభుత్వం సాంక్షన్​చేసింది. ప్రస్తుతం మంచిర్యాల, శ్రీరాంపూర్, గోదావరిఖని, బసంత్​నగర్​ నుంచి రాజీవ్​రహదారి మీదుగా పెద్దపల్లికి వెళ్లాలంటే 40 కిలోమీటర్లు ప్రయాణించాలి. మంచిర్యాల–అంతర్గాం బ్రిడ్జి నిర్మిస్తే దాదాపు 18 కిలోమీటర్ల దూరం తగ్గేది. మంచిర్యాల నుంచి నేరుగా బసంత్​నగర్ రాజీవ్​ ఫోర్​ లైన్​కు చేరుకునే అవకాశం ఉండేది.

కొత్తగా ప్రతిపాదించిన ముల్కల్ల–ముర్మూర్​బ్రిడ్జి నిర్మాణంతో రెండు జిల్లా కేంద్రాల మధ్య 5 కిలోమీటర్ల దూరమే తగ్గుతుంది. పైగా అంచనా వ్యయం రూ.164 కోట్ల నుంచి రూ.450 కోట్లకు అంటే దాదాపు రూ.300 కోట్లు పెరుగుతుంది. అంతర్గాం బ్రిడ్జికి కేవలం 15 ఎకరాల భూమి అవసరం కాగా.. ముల్కల్ల–ముర్మూర్ ​బ్రిడ్జికి సుమారు వందెకరాలు సేకరించాల్సి ఉంటుందని అంచనా. ఇప్పటికే ముల్కల్ల శివారులో ఎన్ హెచ్​63 గ్రీన్​ఫీల్డ్​ హైవేకు భూములు ఇవ్వబోమని రైతులు ఆందోళనలు చేస్తున్నారు. అటు ఎల్లంపల్లి ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతులు కూడా ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నారు.