
హైదరాబాద్, వెలుగు: తెలంగాణలోని రెసిడెన్షియల్ స్కూళ్ల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యాపకుల బృందాన్ని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. గురువారం సీఎం రేవంత్ని ఆయన నివాసంలో హార్వర్డ్ వర్సిటీ అధ్యాపకుల బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. డాక్టర్ డొమినిక్ మావో నేతృత్వంలోని ఈ బృందం ఉస్మానియా యూనివర్సిటీలో జనవరి 7 నుంచి 12 వరకు నిర్వహిస్తున్న ప్రోగ్రాం ఫర్ సైంటిఫిక్లీ ఇన్స్పైర్డ్ లీడర్ షిప్ (పీఎస్ఐఎల్– 24) కార్యక్రమం గురించి సీఎంకు వివరించారు.
పాఠశాల విద్యాశాఖ సహకారంతో 40 ప్రభుత్వ స్కూళ్లల్లోని స్టూడెంట్లతో పాటు 33 జిల్లాల నుంచి ఉన్నత పాఠశాలల్లో ఇంగ్లిష్ టీచర్లకు 5 రోజులు పీఎస్ఐఎల్– 24 శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. విద్యా శాఖ ముఖ్యకార్యదర్శి బుర్ర వెంకటేశం ఈ కార్యక్రమ వివరాలను సీఎం రేవంత్కు వివరించారు. కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ రవీందర్, విద్యాశాఖ కమిషనర్ దేవసేన తదితరులు పాల్గొన్నారు.