
- అట్రాక్ట్ చేసే కంటెంట్, టెక్ట్స్ మెసేజ్లు
- కాపీ పేస్ట్ చేసిన వెంటనే స్మార్ట్ ఫోన్, కంప్యూటర్లలోకి మాల్వేర్
- పేస్ట్ జాకింగ్ పేరుతో సైబర్ నేరగాళ్ల కొత్త ట్రెండ్
హైదరాబాద్, వెలుగు:
‘పేస్ట్ జాకింగ్’.. ఇది ప్రస్తుతం సైబర్ నేరగాళ్ల కొత్త ట్రెండ్. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా సైబర్ నేరగాళ్లు కూడా అధునాతన మాల్వేర్ రూపొందిస్తున్నారు. ఆన్లైన్లో ‘కాపీ పేస్ట్’ ప్రక్రియను తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. ఫిషింగ్ మెయిల్స్ తరహాలో హ్యాకింగ్కు పాల్పడుతున్నారు. ఇందుకోసం ఆన్లైన్ సైట్లలో అట్రాక్ట్ చేసేవిధంగా కంటెంట్ లేదా వీడియోలను పోస్టు చేస్తున్నారు. వీటిని కాపీ చేసుకునేలా ఆప్షన్ ఇస్తున్నారు.
దీంతో అనేక రకాల పాపప్స్ కనిపిస్తుంటాయి. ఇలాంటి పాపప్ కాపీ చేస్తే చాలు.. మన చేతుల్లోని స్మార్ట్ ఫోన్, కంప్యూటర్.. మనకు తెలియకుండానే సైబర్ క్రిమినల్స్ చేతుల్లోకి వెళ్లిపోతాయి. ఈ హ్యాకింగ్ను సైబర్ నిపుణులు ‘పేస్ట్ జాకింగ్’ గా పిలుస్తుంటారు. సాధారణంగా స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లలో కాపీ-పేస్ట్ చేసే ప్రక్రియ తప్పనిసరి.
దీని ద్వారా డేటాను ఒక చోటు నుంచి కాపీ చేసి, మరొక చోట పేస్ట్ చేస్తుంటాము. ఇది ఒక సాధారణ డేటా ఎంట్రీ వర్క్ మాత్రమే. కాపీ చేయాలనుకుంటున్న డేటాను ఎంట్రీ చేసిన వెంటనే అది క్లిప్బోర్డ్ మెమరీలో చేరుతుంది. తరువాత పేస్ట్ చేయాల్సిన చోట క్లిప్బోర్డ్లోని డేటా మీరు ఆయా స్థానాల్లో పేస్ట్ అవుతుంది. దీన్నే ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు తమకు టార్గెట్గా చేసుకున్నారు. పేస్ట్జాకింగ్తో కాపీ అండ్ -పేస్ట్ ఫంక్షన్ను ఉపయోగించి హ్యాకింగ్ చేస్తున్నారు.
పేస్ట్ జాకింగ్ క్లిక్ఫిక్స్ టెక్నిక్ ఇలా
ఆన్ లైన్ లో వెబ్పేజీతోనే పేస్ట్ జంపింగ్ ను ఆపరేట్ చేస్తున్నారు. ఇందుకుగాను ఆయా సైట్లలోని కంటెంట్ ను కాపీ చేయడం వల్ల ఎలాంటి హాని ఉండదని పాపప్స్ అప్ డేట్ చేస్తుంటారు. నకిలీ ఎర్రర్ కోడ్ను కలిగి ఉన్న వెబ్పేజీకి మళ్లించే ఫిషింగ్ ఇ మెయిల్ను పంపిస్తుంటారు. సమస్యను పరిష్కరించడానికి బాధితుడికి కోడ్ లైన్ను కాపీ చేయాలని సూచిస్తుంటారు. కాపీ చేసి పేస్ట్ చేసిన కోడ్ ద్వారా మాల్ వేర్ ఇన్స్టాల్ అవుతుంది. ఇలా స్క్రిప్ట్ మాల్ వేర్ చొరబడి డివైజ్ హ్యాక్ అవుతుంది. కానీ, హ్యాకింగ్ జరిగినట్లు యూజర్ కు ఎలాంటి అనుమానం తలెత్తదు . క్లిప్బోర్డ్ కంటెంట్ను మాల్ వేర్ కోడ్ లేదా యూఆర్ఎల్ తో అనుసంధానం చేస్తున్నారు. ఈ క్రమంలో కాపీ పేస్ట్ల ద్వారా స్మార్ట్ ఫోన్, కంప్యూటర్ డేటాను హ్యాక్ చేస్తున్నారు. పేస్ట్ జాకింగ్ సిస్టమ్ వల్ల కంటెంట్ను పేస్ట్ చేసినప్పుడు లేదా మార్చినప్పుడు సైబర్ అటాక్ ను గ్రహించలేరు. మాల్ వేర్ ఇన్స్టాలేషన్ వల్ల డేటా చోరీ. మన ప్రమేయం లేకుండానే ఆన్ లైన్ ట్రాన్సాక్షన్లు సహా ఆన్ లైన్ లో దోపిడీ జరుగుతుంది. ఇలాంటి తరహా పేస్ట్ జాకింగ్కు సంబంధించి ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా 500 శాతం ఫిర్యాదులు నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్కు అందాయి.
సైబర్ సెక్యూరిటీ టూల్స్ బెస్ట్ : విశ్వనాథ్, ఎథికల్ హ్యాకర్, హైదరాబాద్
పేస్ట్ జాకింగ్ అనేది ఇంటర్ ఫేస్లో పేస్ట్ చేసేప్పుడు మాల్ వేర్ చొరబడేందుకు చేసే అధునాత హ్యాకింగ్. వెబ్సైట్లు, ఫోరమ్లు లేదా ఆన్లైన్ నుంచి కాపీ పేస్ట్ చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. హ్యాకింగ్ పై అలర్ట్ చేసేందుకు అధునాతన వెబ్ బ్రౌజర్లు, సైబర్ సెక్యూరిటీ టూల్స్ ను ఇన్ స్టాల్ చేసుకోవాలి. కంప్యూటర్ లేదా స్మార్ట్ ఫోన్లను సెక్యూరిటీ ప్యాచ్లతో ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తూ ఉండాలి. అనుమానాస్తదంగా ఉన్న లింకులు, మెసేజ్లను కాపీ చేయకూడదు.