
కోరుట్ల,వెలుగు: మొక్కజొన్న కొనుగోలుకు ప్రభుత్వం వెంటనే సెంటర్లను ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. శుక్రవారం జగిత్యాల జిల్లా మెట్పల్లి టౌన్ రైతు వేదిక ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ యార్డు నుంచి పాత బస్టాం డ్వరకు రైతులు ర్యాలీగా వెళ్లారు. పాత బస్టాండ్ శాస్ర్తి చౌరస్తా వద్ద రాస్తారోకో, ధర్నా చేశారు. రైతులు మాట్లాడుతూ.. పంటను ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో అకాల వర్షాలతో తాము నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నాతో హైవే రోడ్డుపై ట్రాఫిక్ ఏర్పడింది. ఆర్డీఓ శ్రీనివాస్, పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి రైతులతో మాట్లాడారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు.