- ప్రపంచంలో 70 శాతం కేసులు అక్కడే
- ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్లో మృత్యుఘోష
- ఉమ్మడి ఆర్థిక సాయానికి ఈయూ నో
- చైనా, నాటో హెల్ప్ కోరిన స్పెయిన్
కరోనా.. అమెరికాకు, యూరప్కు చుక్కలు చూపిస్తోంది. లక్ష కేసులు దాటిన ఫస్ట్ దేశంగా అమెరికా బ్యాడ్ రికార్డ్ కొట్టేస్తే.. 3 లక్షలకు పైగా కేసులతో ప్రపంచంలో సగం కేసులు అక్కడేనన్న బ్యాడ్ రికార్డ్ను యూరప్ మూటగట్టుకుంది. ఇటలీ, స్పెయిన్లోనూ పరిస్థితి మరింత దిగజారిపోతోంది. ఇటలీలో ఒక్కరోజే వెయ్యి మంది, స్పెయిన్లో 837 మంది బలయ్యారు. ఫ్రాన్స్, ఇరాన్లోనూ పరిస్థితి ఏమంత బాగాలేదు. ప్రపంచవ్యాప్తంగా 6,63,431 మంది కరోనాకు బాధితులయ్యారు. చనిపోయిన వారి సంఖ్య 30 వేలు దాటింది. 30,865 మంది ఇప్పటిదాకా కరోనాకు బలయ్యారు. 1,41,953 మంది కోలుకున్నారు. స్పెయిన్లో ఒక్కరోజే 552 మంది చనిపోయారు. బ్రిటన్లో మరణాలు వెయ్యి మార్కును దాటాయి. 1,019 మంది చనిపోయారు.
కరోనా దెబ్బకు యూరప్ అతలాకుతలమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల్లో 3 లక్షలకు పైగా కేసులు అక్కడే నమోదయ్యాయి. ఇటలీ, స్పెయిన్లోనైతే పరిస్థితి చేయి జారిపోతోంది. రోజు వందల్లో జనం చనిపోతున్నారు. వేలల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే ఇటలీలో వెయ్యి మంది చనిపోయారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఇదే హయ్యెస్ట్. స్పెయిన్లో 837 మంది మృతి చెందారు. ఇట్లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ సాయం చేయడానికి యూరోపియన్ యూనియన్ ససేమిరా అంటోంది. ఉమ్మడి ఆర్థిక సాయానికి యూనియన్ దేశాలు నో చెప్పాయి. దీంతో ఈయూపై ఇటలీ విమర్శలు గుప్పిస్తోంది. సాయం చేయకపోతే ఇక యూనియన్ ఎందుకని ప్రశ్నిస్తోంది. ఇటలీ పత్రికలు కూడా ‘అగ్లీ యూరప్’ అంటూ హెడ్లైన్లతో వార్తలు రాశాయి.
ఇరాన్లోనూ ఆగమే
ఇరాన్లోనూ పరిస్థితి కష్టంగానే ఉంది. గత 24 గంటల్లో 3 వేలకు పైగా కొత్త కేసులొచ్చాయని అక్కడి అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు 2,517 మంది చనిపోయారన్నారు. 3,200 మంది పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ఐదున్నర కోట్ల మందిని స్క్రీనింగ్ చేశామన్నారు.
దక్షిణాఫ్రికా లాక్డౌన్
ఆఫ్రికా ఖండంలోనూ మెల్లమెల్లగా వైరస్ ఉధృతి పెరుగుతోంది. దక్షిణాఫ్రికాలో తొలి కరోనా మరణం నమోదవడంతో ఆ దేశం శుక్రవారం నుంచి మూడు వారాల లాక్డౌన్ ప్రకటించింది. కెన్యాలో కర్ఫ్యూ హింసాత్మకమైంది. ఫెర్రీలో ప్రయాణిస్తున్న వారిపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.
బ్రెజిల్ అధ్యక్షుడు సంచలన కామెంట్స్
కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోవడానికి చర్యలు తీసుకోవడం లేదంటూ బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బొల్సోనారోపై అక్కడి రాష్ట్రాల గవర్నర్లు విమర్శలు చేస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకే ఆయన చర్యలు తీసుకుంటున్నారని ఇప్పటికే మండిపడుతున్నారు. ఇలాంటి టైంలో బొల్సొనారో సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నన్ను క్షమించండి. కొంత మంది చనిపోతారు.. చనిపోతారు. అదే జీవితం’ అన్నారు. ‘రోడ్డు యాక్సిడెంట్లు జరుగుతున్నాయని కార్ల కంపెనీని మూసేయలేం కదా’ అని చెప్పుకొచ్చారు.
పాక్లో కరోనా కల్లోలం
మన పక్క దేశం పాకిస్థాన్లో కరోనా విజృంభిస్తోంది. ముఖ్యంగా అక్కడి పంజాబ్ ప్రావిన్స్లో వేగంగా పాకుతోంది. పాక్లో 1500 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 11 మంది చనిపోయారు. ఏడుగురి పరిస్థితి విషమంగా ఉందని అక్కడి అధికారులు తెలిపారు. వైరస్ సోకిన వాళ్లలో ఎక్కువగా ఇరాన్ నుంచి వచ్చిన వాళ్లేనన్నారు. పంజాబ్ ప్రావిన్స్లో మొత్తంగా 490 కేసులు రికార్డయ్యాయి. ఇందులో 207 కేసులు ఒక్క డేరా ఘాజీ ఖాన్ జిల్లాలోనే ఉన్నాయి. పాక్లో ఫస్ట్ కరోనా కేసు నమోదైన సింధ్ ప్రావిన్స్లో 457 కేసులు నమోదయ్యాయి.
వుహాన్ తెరుచుకుంటోంది
చైనాలో శుక్రవారం 54 మందికి వైరస్ సోకింది. ముగ్గురు చనిపోయారు. లోకల్గా ఎవరికీ వ్యాధి సోకలేదు. రెండు నెలల ఐసోలేషన్ తర్వాత వుహాన్లో ఆంక్షలు సడలించారు. షాపులు మెల్లగా తెరుచుకుంటున్నాయి. శనివారం సిటీలో సబ్వే నెట్వర్క్ స్టార్టయింది. కొన్ని షాపింగ్ సెంటర్లను వచ్చే వారం తిరిగి ఓపెన్ చేయనున్నారు.
ఇటలీలో 10 వేల మరణాలు
ఇటలీలో మరణాల సంఖ్య 10 వేలు దాటింది. ఉత్తరాన ఉన్న లొంబార్డీ ప్రాంతంలో మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు అక్కడ 5,400 మంది చనిపోయారు. 37 వేల కేసులు నమోదయ్యాయి. యూరోపియన్ దేశాలతో మూడు రోజుల కిందట జరిగిన సమావేశంలో 27 దేశాలు కరోనాపై యాక్షన్ ప్లాన్కు ముందుకు రాకపోవడంతో ఇటలీ ప్రెసిడెంట్ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా బాండ్లతో డబ్బులు తీస్కుందామని ఇటలీ, స్పెయిన్ కోరగా జర్మనీ, నెదర్లాండ్ ఇప్పటికే నో చెప్పేశాయి. దీంతో ఇట్లాంటి టైమ్లో ఆదుకోకపోతే యూనియన్కు అర్థమే ఉండదని ఇటలీ ప్రెసిడెంట్ అన్నారు.
ఫ్రాన్స్లో ఏప్రిల్ 15 వరకు లాక్డౌన్
కరోనా ఎఫెక్ట్ ఎక్కువవుతుండటంతో లాక్డౌన్ ఏప్రిల్ 15 వరకు కొనసాగుతుందని ఫ్రాన్స్ ప్రధాని వెల్లడించారు. మున్ముందు కష్టకాలం రాబోతోందని, ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ప్రజలను కోరారు. ఈ పరిస్థితి ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదన్నారు.
స్పెయిన్లో ఏప్రిల్12 వరకు
స్పెయిన్లో రోజురోజుకు కరోనా మరణాలు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో అక్కడ 832 మంది చనిపోయారని అధికారులు వెల్లడించారు. దీంతో ఎమర్జెన్సీని ఏప్రిల్ 12 వరకు ప్రభుత్వం పొడిగించింది. కఠిన నిర్ణయమైనా జనం కోసం తప్పదని ప్రధాని పెడ్రో సాన్చెజ్ అన్నారు. స్పెయిన్లో కరోనాతో చనిపోయిన వారిలో 1,307 మంది వృద్ధాశ్రామల్లో ఉంటున్న వారేనని వెల్లడైంది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న ఆశ్రమాల డేటాను సేకరిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. చైనా నుంచి రూ. 3 వేల కోట్ల మెడికల్ పరికరాలను స్పెయిన్ ఆర్డర్ చేసింది. సాయం చేయమని నాటోను కూడా కోరింది.