బయటపడిన తిరుమల శ్రీవారి నకిలీ సేవా టికెట్ల బాగోతం : భక్తుల అప్రమత్తంపై టీటీడీ అలర్ట్

బయటపడిన తిరుమల శ్రీవారి నకిలీ సేవా టికెట్ల బాగోతం : భక్తుల అప్రమత్తంపై టీటీడీ అలర్ట్

కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం భక్తులు చాలా తాపత్రయపడుతుంటారు. దర్శన టికెట్ల కోసం క్యూలైన్లలో నిలబడి ఎంతగానో ప్రయత్నిస్తుంటారు సామాన్య భక్తులు. భక్తుల అవసరాన్ని ఆసరాగా చేసుకున్న కొంతమంది కేటుగాళ్లు నకిలీ దర్శన టికెట్ల దందాకు తెర లేపారు. సుప్రభాత సేవ, ప్రోటోకాల్ దర్శనం, వసతి టికెట్లు ఇప్పిస్తామంటూ లక్షల్లో వసూళ్లకు పాల్పడుతున్నారు కేటుగాళ్ళు. నకిలీ దర్శన టికెట్ల పేరుతో లక్షల్లో మోసానికి పాల్పడ్డ నకిలీరాయుళ్ల బాగోతం బట్టబయలైంది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.

గత మార్చి నెలలో విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీ స్టూడెంట్ సంగమిత్రకు శ్రీవారి సుప్రభాత సేవ, ప్రోటోకాల్ దర్శనం, వసతి  టికెట్లు ఇప్పిస్తామని మదనదీపు బాబు అలియాస్ సందీప్, పవన్ కుమార్ లు రూ.2.60 లక్షలు వసూలు చేశారని తిరుమల 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు పోలీసులు.

దళారుల ద్వారా దర్శనం టికెట్లు బుక్ చేయిస్తామని.. భక్తుల నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది టీటీడీ. శ్రీవారి దర్శనాల కోసం భక్తులు దళారులను ఆశ్రయించి ఇబ్బందులకు గురికావద్దని కోరారు టీటీడీ అధికారులు. శ్రీవారి దర్శనానికి వెళ్లే సమయంలో భక్తులు పొందిన టికెట్లను టీటీడీ విజిలెన్స్ సిబ్బంది పరీక్షించడం జరుగుతుందన్నారు. ఆ సమయంలో భక్తులు పొందిన టికెట్లు నకిలీగా తేలితే అనవసరమైన ఇబ్బందులు గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు అధికారులు.

శ్రీవారి భక్తులకు మోసపూరిత మాటలు చెప్పి నకిలీ దర్శన టికెట్లు, వసతి కల్పిస్తామని దళారులు  ఎవరైనా చెప్పినా నమ్మవద్దని సూచించారు అధికారులు. ఎవరైనా ఇలాంటి మోసాలకు పాల్పడితే.. తమ దృష్టికి తీసుకురావాలని కోరారు అధికారులు. టిటిడి విజిలెన్స్ అధికారులు నిరంతరం అందుబాటులో ఉంటారని, 0877 - 2263828 ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని... భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు, దళారులు శ్రీవారి దర్శనం టికెట్ల పేరుతో దందా చేస్తే వెంటనే సదరు మోసపూరిత వ్యక్తులు, దళారుల వివరాలను  ఫోన్ చేసి టిటిడి విజిలెన్స్ దృష్టికి తీసుకురావాలని కోరారు అధికారులు.

టీటీడీ అధికారిక వెబ్ సైట్ https://ttdevasthanams.ap.gov.in ద్వారా మాత్రమే ఆన్ లైన్లో తమ ఆధార్ కార్డు ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాలని దళారుల మాయమాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు అధికారులు.