
భారతదేశంలో ప్రజలు సంపాదన విషయంలో ఎంత ఎక్కువ ఉంటే అంత గొప్పగా భావిస్తుంటారు. అయితే సంపద సృష్టికి ఎంత డబ్బు సంపాదిస్తున్నాం అనే దానికంటే దాని ఎలా వినియోగిస్తున్నాం అన్న విషయం చాలా కీలకమైనదని చార్టర్డ్ అకౌంటెంట్ అభిషేక్ వాలా వెల్లడించారు. స్పష్టత లేకుండా సంపాదించే డబ్బు అలాగే నిశ్సబ్దంగా మన దగ్గరి నుంచి మాయమైపోతుందని ఆయన చెప్పారు.
సంపాదించటం కంటే దానిని సరిగా మేనేజ్ చేయటం చాలా ముఖ్యమైన అంశంగా అభిషేక్ పేర్కొన్నారు. కొన్ని నెలల కిందట తమ వద్దకు ఒక క్లయింట్ వచ్చారని ఆమెకు ఎలాంటి బయటి ఖర్చులు, పెద్ద ఇన్వెస్ట్మెంట్లు లేవని గుర్తించామన్నారు. పైగా 6 నెలలకు ఎమర్జెన్సీ ఫండ్, తమ ఎంబీఏ కోసం చేస్తు్న్న ఎస్ఐపీ పెట్టుబడితో చాలా క్లియర్ ప్లానింగ్ ఆమె కలిగి ఉన్నారని చెప్పారు. ఆమె దీర్ఘకాలిక వ్యూహంతో తన ఆదాయాన్ని, పెట్టుబడులను సక్రమంగా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఇది ఆమెపై ఆర్థిక భారాన్ని లేకుండా చేస్తుందని సీఏ చెప్పారు.
అలాగే మరో క్లయింట్ నెలకు రూ.2లక్షల 50 వేలు సంపాదిస్తున్నప్పటికీ నెలాఖరుకు వచ్చేసరికి డబ్బుల కోసం కటకటలాడుతున్నారని చెప్పారు. ఆమె అనవసరమైన ఖర్చులు, ఎలాంటి సేవింగ్స్ లేకపోవటం,కనీసం ఎమర్జెన్సీ ఫండ్ కూడా లేకపోవటంతో ఆర్థిక పమరైన ప్లానింగ్ కొరవడటాన్ని ఎత్తిచూపారు. ఇది ఎక్కువ సంపాదించినప్పటికీ వారిపై ఆర్థికంగా ఒత్తిడిని కలిగిస్తుందని చెప్పారు. ఆమె పరిస్థితి ప్రతి నెల జీతం ఎప్పుడు పడుతుందనే దానిపైనే ఉందని చెప్పారు.
ఇక్కడ రెండున్నర లక్షలు సంపాదించే వ్యక్తి కంటే నెలకు రూ.90వేలు సంపాదిస్తూ వాటిని సరైన విధంగా వినియోగిస్తూ, క్లారిటీతో ముందుకు వెళుతున్న వ్యక్తి దీర్ఘకాలంలో మంచి ఆర్థిక స్థిరత్వాన్ని కలిగి ఉంటారని చెప్పారు. డబ్బులు సరిగా మేనేజ్ చేసేవారి దగ్గరే అది నిలుస్తుందని.. సంపన్నులుగా మారాలంటే ఎంత సంపాదిస్తున్నాం అనేది ముఖ్యం కాదని అందులో ఎంత మిగులుస్తున్నాం, ఆ మెుత్తాన్ని ఎక్కడ ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నాం అనేదే ముఖ్యమన్నారు. సరైన ప్రణాళికతో దాచిన డబ్బు రెట్టింపు అవుతుందని, అందుకే డబ్బు సంపాదించే వారికి ముందుగా దానిని ఏం చేయాలో క్లారిటీ కూడా అవసరం అని అన్నారు.