కరోనా తగ్గినా.. ఎఫెక్ట్‌ తగ్గుతలె

కరోనా తగ్గినా.. ఎఫెక్ట్‌ తగ్గుతలె
  • పోస్ట్‌ కొవిడ్‌ సమస్యలతో పేషెంట్లు పరేషాన్‌
  • బాడీలో ఆర్గాన్స్​పై తీవ్ర ప్రభావం
  • హాస్పిటళ్లలో రెగ్యులర్‌ ఓపీలో 50 శాతానికి పైగా వీళ్లే
  • పెరుగుతున్న పోస్ట్‌ కొవిడ్‌ వార్డులు, స్పెషల్‌ ఓపీలు

హైదరాబాద్, వెలుగు: కరోనా బారిన పడిన పేషెంట్లు దాన్నుంచి ఎలాగోలా కోలుకుంటున్నా ఆ తర్వాతి ఎఫెక్ట్‌‌తో మాత్రం అవస్థ పడుతున్నరు. శరీర అవయవాలపై వైరస్‌‌ విపరీతమైన ప్రభావం చూపిస్తుండటంతో పరేషానైతున్నరు. కొందరికి బీపీ, షుగర్‌‌ స్థాయిల్లో తేడాలు లాంటి సమస్యలు వస్తుండగా ఇంకొందరికి గుండె, కిడ్నీ, లంగ్స్‌‌ డ్యామేజై ప్రాణం మీదికొస్తోంది. రోజురోజుకూ ఇలాంటి పేషెంట్లు ఎక్కువవుతుండటంతో వీళ్ల కోసం హాస్పిటళ్లు ప్రత్యేకంగా డాక్టర్ల టీమ్‌‌లను రెడీగా ఉంచుతున్నయి. పోస్ట్‌‌ కొవిడ్‌‌ ఓపీలను ఏర్పాటు చేస్తున్నయి.

కరోనా ట్రీట్‌‌మెంట్‌‌లానే..

హాస్పిటళ్లు పోస్ట్ కొవిడ్ పేషెంట్లకూ కరోనా పేషెంట్ల లాగే స్పెషల్‌‌ ట్రీట్‌‌మెంట్‌‌ అందిస్తున్నాయి. ఆన్‌‌లైన్ కన్సల్టెన్సీని అందుబాటులో ఉంచుతున్నాయి. ప్రతి హాస్పిటల్‌‌లో కరోనా వార్డుతో పాటు పోస్ట్ కొవిడ్ పేషెంట్ల కోసం ప్రత్యేక వార్డులు కేటాయిస్తున్నాయి. ఇలాంటి వాళ్ల కోసం అపోలో, కిమ్స్, కేర్ వంటి ఆస్పత్రులు కొంతమంది డాక్టర్స్‌‌తో స్పెషల్ టీమ్‌‌లను ఏర్పాటు చేస్తున్నాయి. పోస్ట్ కొవిడ్ పేషెంట్లకు డాక్టర్లు వీడియో, ఆడియో కాల్స్ ద్వారా సూచనలిస్తున్నారు. పేషెంట్ కండిషన్, ప్రాబ్లమ్‌‌ను బట్టి ఎమర్జెన్సీ కేసులైతే హాస్పిటల్‌‌లో అడ్మిట్ అవ్వాలని చెబుతున్నారు. రోజూ వచ్చే రెగ్యులర్ ఓపీలో 50 శాతానికి పైగా పోస్ట్ కొవిడ్ కేసులే ఉంటున్నాయని డాక్టర్లు చెబుతున్నారు.

నార్మల్ టు సివియర్ సమస్యలతో.. 

కరోనా తర్వాతి స్టేజ్‌‌లో పేషెంట్లు జ్వరం, దగ్గు, నిద్రలేమి, తలనొప్పి లాంటి ప్రాబ్లమ్స్‌‌తో పాటు లంగ్ ఫైబ్రోసిస్‌‌, కిడ్నీ ఫెయిల్యూర్‌‌, ఒబెసిటీ, హార్ట్ ఎటాక్ వంటి సమస్యలతో బాధపడుతున్నారు. తీవ్ర సమస్యలతో  అడ్మిట్ అవుతున్న వాళ్లూ ఉన్నారు. పోస్ట్‌‌ కొవిడ్‌‌ ఎఫెక్ట్‌‌లో లంగ్స్, బ్రెయిన్, హార్ట్ పై తీవ్రమైన ఇంపాక్ట్ ఉంటోందని డాక్టర్లు చెబుతున్నారు. మోస్తరు నుంచి సివియర్ స్టేజ్‌‌ వరకు వెళ్లి తగ్గిన వాళ్లకు 3 నెలల తర్వాత మెదడులో రక్తం గడ్డకట్టుకుపోయి పెరాలసిస్ ఎటాకై బ్రెయిన్ స్ట్రోక్‌‌ వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు. హార్ట్ ఎన్ లార్జ్‌‌మెంట్, హార్ట్ బీట్ పెరుగుతోందని చెబుతున్నారు. గుండె నుంచి ఊపిరితిత్తులకు జరిగే రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టి పల్మనరీ థ్రాంబో ఎంబారిజమ్ వచ్చే ప్రమాదముందని అంటున్నారు.

40 ఏండ్లు పైబడినోళ్లే..

నిద్ర లేకపోవడం, తలనొప్పి, నీరసం, బాడీ పెయిన్స్, ఛాతినొప్పి సమస్యలతో పేషెంట్స్‌‌ ఎక్కువగా వస్తున్నారు. న్యూరలాజికల్, హార్ట్ సమస్యలతోనూ అడ్మిట్ అవుతున్నారు. డైలీ ఓపీలో కరోనా నుంచి రికవరై వస్తున్న వాళ్లే 50 శాతం ఉంటున్నారు. వీళ్లలో ఎక్కువగా 40 ఏళ్లకు పై పడిన వాళ్లే ఉంటున్నారు. పోస్ట్ కొవిడ్ పేషెంట్లను నార్మల్ వార్డుల్లో ఉంచుతున్నాం. వారి నుంచి ఇన్ఫెక్షన్ రాదు.

– జి. నవోదయ్ (కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్,కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్)

ఊపిరితిత్తుల్లో పొర గట్టిపడుతోంది

కరోనా నుంచి రికవరైన వాళ్లలో ఎక్కువగా లంగ్స్, బ్రెయిన్, హార్ట్‌‌  సమస్యలతో అడ్మిట్‌‌ అవుతున్నారు. చాలా మందికి తొలుత ఆక్సిజన్ అవసరం లేకుండా ట్రీట్‌‌మెంట్‌‌ అందించినా తర్వాత ఆక్సిజన్‌‌తో పాటు మెడిసిన్‌‌, ప్లాస్మా థెరపీ చేశాం. ఇంప్రూవ్ అయ్యారు. ట్రీట్‌‌మెంట్‌‌ తర్వాత కోలుకునే ప్రాసెస్‌‌లో కొంతమందికే ఆక్సిజన్‌ అవసరమవుతోంది. కారణం స్పాంజ్‌‌లా ఉండే ఊపిరితిత్తుల్లోని పొర గట్టి పడి ఇంటెన్సిషియల్ లంగ్స్ డిసీజ్ వస్తోంది. కీళ్ల వాతం, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి హార్ట్ ఫ్లక్చువేషన్స్‌‌ ఉంటున్నాయి.

– డా. రమణ ప్రసాద్ (పల్మనాలజిస్ట్, కిమ్స్, సికింద్రాబాద్)