కామారెడ్డి జిల్లా : భిక్కనూరు మండలం జంగంపల్లిలో దారుణం జరిగింది. కరోనా భయంతో తల్లి కొడుకును ఊళ్ళోకి రానివ్వలేదు గ్రామస్తులు. గ్రామ శివారులో ఉన్న స్కూల్ గదిలోనే ఉండాలంటూ గొడవ చేశారు. కరోనా రాకున్నా.. లక్షణాలు లేకున్నా వారిని స్కూలులో ఉంచారు గ్రామస్తులు. వీరు కూతురు డెలివరీ కోసం హాస్పిటల్ కి వెళ్లివచ్చారు. అయితే డెలివరీ అయిన కూతురుకు పుట్టిన శిశువుకి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. కూతురు డెలివరీ కోసం హాస్పిటల్ కి వెళ్ళి వచ్చినందుకు తల్లి, కొడుకులకు కూడా వచ్చి ఉంటుందని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేశారు.
దీంతో తల్లీకొడుకులను గ్రామంలోకి రానివ్వకపోవడంతో.. 3 రోజుల పాటు రోడ్లపై.. బస్టాండ్ లో పడుకొని ఇబ్బందులు పడ్డారు. చేసేదేమీలేక.. తీవ్ర మనో ఆవేదనకు గురైన తల్లీకొడుకులు.. సెల్ఫీ వీడియోలు తీసి తమ బాధను పట్టించుకోవాలంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కరోనా కంటే గ్రామస్తుల మానసిక వేధింపులతోనే చనిపోయాలా ఉన్నామని వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. హోమ్ క్వారంటైన్ లో ఉంటామని చెప్పినా వినడం లేదని కన్నీరుమున్నీరుగా విలపించారు బాధితులు.