
వాషింగ్టన్: ప్లాస్మా ట్రీట్మెంట్పై ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని, ఈ ట్రీట్మెంట్ పూర్తిగా సురక్షితమని లేటెస్ట్ స్టడీ ఒకటి తేల్చింది. దాదాపు 20 వేలమంది పేషెంట్లపై స్టడీ చేసి ఎలాంటి సైడ్ఎఫెక్ట్స్ లేవని కన్ఫర్మ్ చేసుకున్నట్లు వివరించింది. ఈమేరకు అమెరికాలోని మాయో క్లినిక్ జర్నల్ ఈ వివరాలను వెల్లడించింది. కరోనా బారిన పడి కోలుకున్న వారి నుంచి ప్లాస్మా వైరస్ ట్రీట్మెంట్లో ఉపయోగపడుతుందని డాక్టర్లు ప్రయోగాత్మకంగా నిర్ధారించుకున్నారు. దీంతో సీరియస్ కండిషన్లో ఉన్న కరోనా బాధితులకు ప్లాస్మా ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఈ ట్రీట్మెంట్ తర్వాత బాధితులు కోలుకుంటున్నారు కూడా.. అయితే, ప్లాస్మా ట్రీట్మెంట్ ఎంత వరకు సేఫ్ అంటూ చాలామంది డాక్టర్లు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో మాయో క్లినిక్ దీనిపై స్టడీ చేపట్టింది. ప్లాస్మా ట్రీట్మెంట్ తీసుకున్న పేషెంట్ల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించింది. ఏప్రిల్ 3 నుంచి జూన్11 వరకు హాస్పిటల్లో ప్లాస్మా ట్రీట్మెంట్ తీసుకున్న వారిని స్టడీ చేసింది. పేషెంట్లలో 40 శాతం మంది మహిళలు, 20 శాతం మంది ఆఫ్రికన్ అమెరికన్లు, 35 శాతం మంది సెంట్రల్, సౌత్ అమెరికన్లు కాగా 5 శాతం మంది ఆసియా దేశాల వారు ఉన్నారని పేర్కొంది. ట్రీట్మెంట్కు ముందు 12 శాతం ఉన్న మరణాల రేటు .. ఆతర్వాత 8.6 శాతానికి తగ్గిందని మాయో క్లినిక్ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ మైఖెల్ జాయ్నర్ చెప్పారు. వైరస్ ప్రభావం కనిపించిన తొలినాళ్లతో పోలిస్తే ఇప్పుడు మెడికల్ కేర్ మెరుగుపడడం కూడా మరణాల రేటు తగ్గడానికి ఓ కారణమని అన్నారు.