ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం తూతిక లింగన్నపేటలో ఫ్రిడ్జ్ (రిఫ్రిజిరేటర్) బాంబులా పేలింది.నల్లజర్ల సత్యనారాయణ ఇంట్లో పెద్ద శబ్ధం తో రిఫ్రిజిరేటర్ పేలడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మంటల్లో ఇంట్లో విలువైన వస్తువులు మంటల్లో కాలిపోయాయి. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంటలార్పారు.
ఇటీవల తెలంగాణ లో పలు చోట్ల ఫ్రిడ్జ్ లు పేలిన ఘటనలు చోటు చేసుకున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లాలో ఫ్రిడ్జ్ పేలిన ఘటనలో తల్లి, కుమారుడు చనిపోయారు. హైదరాబాద్ లోని సనత్ నగర్ లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఫ్రిడ్జ్ పేలుడు ధాటికి ఇంటి గోడలు, పైకప్పు డ్యామేజ్ అయ్యాయి.
ఫ్రిడ్జ్ కంప్రెసర్లో సాంకేతిక లోపాలు, గ్యాస్ లీకేజీ లేదా షార్ట్ సర్క్యూట్ వల్ల పేలుళ్లు జరుగుతున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా 8-10 ఏళ్లు పైబడిన పాత ఫ్రిడ్జ్లలో ఈ ప్రమాదాలు ఎక్కువ. వేసవిలో అధిక వేడి, కంప్రెసర్ కాయిల్స్లో దుమ్ము చేరడం వల్ల వేడెక్కి, గ్యాస్ బయటకు వెళ్లలేక పేలుడుకు దారితీస్తున్నాయని ఎలక్ట్రిక్ పరికరాలు నిపుణులు చెబుతున్నారు.
