
ఏపీలో కరోనా బాధితుల సంఖ్య రోజు రోజుకు భారీగా పెరుగుతున్నాయి. శనివారం రాత్రి 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు జరిగిన టెస్టుల్లో ఏకంగా 34 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
కర్నూలు జిల్లాలో ఇప్పటి వరకు కేవలం నాలుగు కేసులు మాత్రమే ఉండగా ఒక్కసారిగా 23 మందికి కొత్తగా వైరస్ సోకినట్లు గుర్తించామని పేర్కొంది. అలాగే ఒంగోలులో రెండు, చిత్తూరు జిల్లాలో 7, నెల్లూరు జిల్లాలో 2 కరోనా కేసులు నమోదైనట్లు తెలిపింది. కొత్తగా నమోదైన 34 కేసులతో కలిపి ఏపీలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 226కు చేరినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.
జిల్లాల వారీగా చూస్తే నెల్లూరులో అత్యధికంగా 34 కరోనా కేసులు నమోదు కాగా.. ఆ తర్వాత గుంటూరులో 30, కృష్ణా జిల్లాలో 28 మంది వైరస్ బారినపడ్డారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఇప్పటి వరకు కరోనా పేషెంట్ల సంఖ్య జీరో కావడం కొంత ఊరటనిస్తోంది.