లండన్ నుంచి వచ్చిన సింగర్ కు కరోనా.. రాగానే స్టార్ హోటల్లో పార్టీ

లండన్ నుంచి వచ్చిన సింగర్ కు కరోనా..  రాగానే స్టార్ హోటల్లో పార్టీ

మహమ్మారి కరోనా రోజు రోజుకు విస్తరిస్తుంది. లేటెస్ట్ గా ఈ వైరస్ సినీ బాలీవుడ్ ఇండస్ట్రీకి పాకింది.  బేబి డాల్ సాంగ్ తో  ఫేమస్ అయిన బాలీవుడ్ సింగర్(41) కనికా కపూర్ కు ఇవాళ(20న)  వైద్యపరీక్షలో కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం ఆమెను లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్శిటీ (కెజిఎంయు) ఆసుపత్రిలో చేర్చారు.

కొన్ని రోజుల క్రితం లండన్ వెళ్లిన కనికా కపూర్ మార్చి 15న లక్నోకు వచ్చింది. ఎయిర్ పోర్టులో స్ర్కీనింగ్ టెస్టు చేసినపుడు ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. అయితే నాలుగు రోజుల క్రితం జలుబు, జ్వరంతో ఆస్పత్రిలో చేరింది. అపుడు టెస్టులు చేయగా ఆమెకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. వెంటనే కనికాను,ఆమె ఫ్యామిలీని క్వారంటైన్ కు తరలించారు.

అయితే కనికా ట్రావెల్ చేసినపుడు ఆమె  చాలా మందిని కలిశారు. అసలు విషయమేంటంటే కనికా కపూర్ లక్నో రాగానే తన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్  కోసం ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో దాదాపు 100 మందితో ఓ పార్టీ నిర్వహించారు. ఈ పార్టీకి, బ్యూరోక్రాట్లు, రాజకీయనాయకులు, సామాజిక వేత్తలు హాజరయ్యారు. తర్వాత కనికా కపూర్ అదే హోటల్ లో నైట్ బస చేశారు .కనికా కపూర్  లండన్ నుండి లక్నో వచ్చిన తర్వాత మూడు పార్టీలకు హాజరయ్యారని ఆమె తండ్రి రాజీవ్ కపూర్  చెప్పారు.

ఆమెకు మూడు పార్టీలలో సుమారు 350-400 కుటుంబాలతో పరిచయం ఏర్పడిందన్నారు. కనికాతో పాటు, తాము కూడా ఒంటరిగా ఉన్నామన్నారు. అయితే ఎయిర్ పోర్ట్ అధికారులను కనికా మోసగించినట్లు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. కనికా ఎయిర్ పోర్ట్ లో పరీక్ష చేసిన సమయంలో ఎటువంటి లక్షణాలు లేవన్నారు. కనికా కపూర్ కు పాజిటివ్ రావడంతో వైద్య అధికారులు అలర్ట్ అయ్యారు. ఆమె ట్రావెలింగ్ లో, అలాగే పార్టీలో ఎవరెవరితో  కలిసిందనే విషయాలపై ఆరా తీస్తున్నారు.