వ్యాక్సిన్​ ఆగయా..ఇవాళ జిల్లా కేంద్రాలకు

వ్యాక్సిన్​ ఆగయా..ఇవాళ జిల్లా కేంద్రాలకు
  • పుణె సీరమ్​ ఇనిస్టిట్యూట్ నుంచి 31 బాక్సుల్లో 3.64 లక్షల డోసులు
  • సెంట్రల్​ డ్రగ్​ స్టోరేజీలో భద్రపర్చిన అధికారులు
  • నేడు ఉమ్మడి జిల్లాల్లోని రీజనల్​ స్టోరేజీ సెంటర్లకు తరలింపు

హైదరాబాద్, వెలుగు: కరోనా వ్యాక్సిన్​ హైదరాబాద్​కు వచ్చేసింది. సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్‌‌ఐఐ) తయారు చేసిన కొవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులు మంగళవారం ఇక్కడికి చేరుకున్నాయి. పుణె నుంచి స్పెషల్ కార్గో ఫ్లైట్లో 31 బాక్సుల్లో వ్యాక్సిన్ డోసులను పంపగా.. మధ్యాహ్నం 12:05 గంటలకు శంషాబాద్ ఎయిర్‌‌‌‌పోర్టులో రాష్ట్ర అధికారులు వాటిని రిసీవ్​ చేసుకున్నారు. అక్కడి నుంచి ఇన్సులేటర్‌‌‌‌ వెహికల్‌‌లో కోఠిలోని సెంట్రల్‌‌ డ్రగ్‌‌ స్టోరేజ్ సెంటర్‌‌‌‌కు తరలించారు. వెహికల్ ముందు, వెనకా పోలీసు ఎస్కార్ట్‌‌ పెట్టారు. మధ్యాహ్నం 12:55 గంటలకు డ్రగ్ స్టోరేజీ సెంటర్ వద్దకు చేరుకున్నారు. పబ్లిక్ హెల్త్ డైరెక్టర్‌‌‌‌ శ్రీనివాసరావు, డీఎంఈ రమేశ్‌‌రెడ్డి, టీఎస్‌‌ఎంఎస్‌‌ఐడీసీ ఎండీ చంద్రశేఖర్‌‌‌‌రెడ్డి, ఇమ్యునైజేషన్ ఆఫీసర్ సుధీర తదితరులు.. వ్యాక్సిన్​ బాక్సులకు ప్రత్యేక పూజలు చేసి, స్టోరేజీ సెంటర్‌‌‌‌లోకి తరలించారు. వాకిన్​ ఫ్రీజర్‌‌‌‌లో భద్రపరిచి.. పోలీసు సెక్యూరిటీ పెట్టారు.

ఒక్కో బాక్సులో 12 వేల డోసులు

రాష్ట్రంలో తొలిరౌండ్‌‌లో 3 లక్షల 40 వేల మందికి వ్యాక్సిన్ వేయనున్నారు. ఇప్పటివరకు మూడు లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా.. వ్యాక్సినేషన్  మొదలయ్యే సరికి మరో 40 వేల మంది రిజిస్టర్​ చేసుకుంటారని హెల్త్ డిపార్ట్‌‌మెంట్ అంచనా వేసింది. ఇందుకు అనుగుణంగా.. పది శాతం వేస్టేజీతో కలిపి 3.64 లక్షల డోసులను కేంద్రం రాష్ట్రానికి పంపింది.  మొత్తం 31 బాక్సులురాగా.. ఒక్కో బాక్సులో 12 వందల వయల్స్‌‌‌‌ ఉన్నాయి. ఒక్కో వయల్‌‌‌‌లో పది డోసుల వ్యాక్సిన్ ఉంటుందని బాక్సుపై ముద్రించారు. ఒక్కో డోసు అర మిల్లీలీటరు (0.5 ఎంఎల్) ఉంటుంది. తొలి డోసు ఇచ్చిన నాలుగు వారాల తర్వాత రెండో డోసు ఇస్తారు. నవంబర్ ఒకటో తేదీన ఉత్పత్తి చేసిన వ్యాక్సిన్‌‌‌‌ను రాష్ట్రానికి పంపించారు. దీని వ్యాలిడిటీ ఆర్నెళ్లు. అంటే ఏప్రిల్ నెలాఖరు వరకు ఎక్స్​పైరీ తేదీ ఉంది. అయితే వారం రోజుల్లోనే ఈ వ్యాక్సిన్​ను వినియోగించనున్నారు. రెండో డోసుకు అవసరమైన వ్యాక్సిన్లను త్వరలోనే రాష్ట్రానికి పంపనున్నారు.

డబ్ల్యూహెచ్‌‌‌‌వో మానిటరింగ్‌తో..

రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌‌‌‌  తీరును వరల్డ్‌‌‌‌ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్​వో) పర్యవేక్షిస్తోంది. హైదరాబాద్‌‌‌‌, వరంగల్‌‌‌‌, కరీంనగర్ సహా పలు జిల్లాల్లో డబ్ల్యూహెచ్‌‌‌‌వో టీమ్‌‌‌‌లు పనిచేస్తున్నాయి. వ్యాక్సినేషన్ ప్రోటోకాల్స్‌‌‌‌, డబ్ల్యూహెచ్‌‌‌‌వో సూచనలు పాటిస్తున్నరా, లేదా? వ్యాక్సిన్ తీసుకున్నవారికి ఎలాంటి రియాక్షన్స్ వస్తున్నాయి వంటి అంశాలను ఆ టీమ్‌‌‌‌లు పరిశీలిస్తాయి. ఈ వివరాలన్నింటితో డబ్ల్యూహెచ్‌‌‌‌వోకు నివేదిక ఇవ్వనున్నాయి.

నేడు జిల్లా కేంద్రాలకు..

వ్యాక్సిన్ డోసులను ఉమ్మడి జిల్లాల్లో ఉన్న రీజనల్ డ్రగ్ స్టోరేజీ సెంటర్లకు బుధవారం తరలించనున్నారు. ఇందుకోసం ఒక్కో జిల్లాకు ఒక్కో ఇన్సులేటర్ వెహికల్ కొనుగోలు చేశారు.  రీజనల్ సెంటర్ల నుంచి వ్యాక్సినేషన్‌‌‌‌కు ముందురోజు కోల్డ్‌‌‌‌ చెయిన్ పాయింట్లకు పంపుతారు. రాష్ట్రవ్యాప్తంగా 866 కోల్డ్‌‌‌‌ చెయిన్ పాయింట్లను ఏర్పాటు చేశారు. మొత్తం 1,200 సెంటర్లలో వ్యాక్సినేషన్ జరగనుంది.