
- పెండింగ్ పనులపై దృష్టి పెడ్తా..
- వరదలపై సర్వసన్నద్ధంగా ఉన్నాం
- డిప్యూటీ సీఎం, మంత్రులతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తా..
- ‘వెలుగు’ తో ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఖమ్మం, వెలుగు: అన్ని రంగాల్లో ఖమ్మం జిల్లాను నెంబర్ వన్గా నిలుపుతానని ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న డిప్యూటీ సీఎం, మంత్రుల సమన్వయంతో ముందుకెళ్తానని చెప్పారు. ఈనెల 13న ఆయన ఖమ్మం కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. గురువారం ‘వెలుగు’తో ప్రత్యేకంగా మాట్లాడారు. విశేషాలు ఆయన మాటల్లోనే..
ప్రభుత్వ పథకాల అమలపైనే దృష్టి
రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు నా మొదటి ప్రాధాన్యత. సీఎం, మంత్రులు, ఉన్నతాధికారుల సూచనలతో ఖమ్మం జిల్లాను ముందుకు తీసుకెళ్తా. జిల్లాలో స్పీడ్ గా, సిన్సియర్ గా పనిచేస్తున్న అధికారుల టీమ్ ఉంది. భూ భారతి చట్టం అమలు, రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తుల పరిశీలన, రైతుల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టినం. ఇందిరమ్మ ఇల్లు మంజూరైన లబ్ధిదారులు త్వరగా నిర్మాణాలు పూర్తి చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇందిరా మహిళా శక్తి కింద మహిళలు లాభదాయకమైన యూనిట్లు ఎంపిక చేసుకునేలా అవగాహన కల్పిస్తున్నాం. మున్నేరు రిటైనింగ్ వాల్, తీగల వంతెన, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు, వివిధ ప్రాజెక్టుల భూసేకరణ పెండింగ్ పనులపై దృష్టి సారిస్తాం.
వరదలపై ముందస్తు సన్నద్ధతతో ఉన్నాం
గత రెండేండ్లలో మున్నేరుకు భారీ వరదలు వచ్చిన విషయం తెలుసు. వరదల నుంచి రక్షణ కోసం ప్రభుత్వం రిటైనింగ్ వాల్ నిర్మిస్తోంది. ఈ వర్షాకాలంలో అది పూర్తి అయ్యే అవకాశం లేదు.. అందుకు ముంపు గ్రామాల్లో, కాలనీల్లో ముందస్తు చర్యలతో సిద్ధంగా ఉన్నాం. 300 మంది ఆపదమిత్రలకు ఇటీవల ట్రైనింగ్ ఇచ్చాం. ఆపదమిత్రలు, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో వాట్సప్ గ్రూపులను ఏర్పాటు చేశాం. భారీ వర్షాల సమయంలో వారిని ముందుగానే అలర్ట్ చేస్తాం. ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా, ముందస్తు సన్నద్ధతతో మా అధికారుల టీమ్ అలర్ట్గా ఉంది. వరదలు, వర్షాల కారణంగా వచ్చే సీజనల్ వ్యాధుల పై ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాం.
ఇక్కడ సేవ చేసే అవకాశం రావడం సంతోషం
ఖమ్మం జిల్లాలో రైతులు చాలా ప్రోగ్రెసివ్ గా ఉంటారు. విభిన్న రకాల పంటల సాగుతో రాష్ట్రానికి ఆదర్శంగా ఉన్నారు. ఇప్పటికే అన్ని రంగాల్లో ఖమ్మం జిల్లా చాలా అభివృద్ధి చెందింది. విద్య, వైద్యం పరంగా ముందంజలో ఉంది. ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో విద్యను మరింత బలోపేతం చేస్తాం. జీరో ఎన్రోల్మెంట్ స్కూల్స్ పై దృష్టి పెట్టి, బడిబాట ద్వారా విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ప్రయత్నిస్తున్నాం.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలను మరింత మెరుగుపరుస్తాం. రెగ్యులర్ గా డాక్టర్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటాం. ఇక్కడ ప్రజలకు సేవ చేసే అవకాశం రావడం సంతోషంగా ఉంది. జిల్లాలో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తా. వాళ్ల సహకారంతో అభివృద్ధి పనులు కొనసాగిస్తాం.